Begin typing your search above and press return to search.

మీటూ : సౌత్‌ హీరోయిన్‌ కు కోర్ట్‌ షాక్‌

By:  Tupaki Desk   |   26 Aug 2019 8:20 AM GMT
మీటూ : సౌత్‌ హీరోయిన్‌ కు కోర్ట్‌ షాక్‌
X
బాలీవుడ్‌ లో ప్రారంభం అయిన మీటూ ఉద్యమం మెల్లగా సౌత్‌ కు కూడా పాకిన విషయం తెల్సిందే. తమిళనాట చిన్మయి ఏ స్థాయిలో మీటూ ఆరోపణలు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన అర్జున్‌ పై హీరోయిన్‌ శృతి హరిహరన్‌ సంచలన ఆరోపణలు చేసింది. షూటింగ్‌ సందర్బంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని.. సీన్‌ చెప్పే ఉద్దేశ్యంతో తనను తాకేందుకు ప్రయత్నించాడంటూ స్టార్‌ హీరో అర్జున్‌ పై శృతి మీటూ అంటూ ఆరోపణలు చేసింది. ఈ విషయమై శృతి హరిహరన్‌ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది.

మీటూ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న సమయంలో నమోదైన కేసు అవ్వడం వల్ల అర్జున్‌ ను పోలీసులు అరెస్ట్‌ కూడా చేయడం జరిగింది. ఆ వెంటనే బెయిల్‌ పై బయటకు వచ్చాడు. అర్జున్‌ తనను లైంగికంగా వేదించాడంటూ శృతి చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసు ప్రస్తుతం కోర్టులో సాగుతోంది. ఈ సమయంలోనే హీరో అర్జున్‌ కుటుంబ సభ్యులు శృతి హరిహరన్‌ పై కోర్టులో పరువు నష్టం దావా వేయడం జరిగింది. తమ కుటుంబంకు చెందిన అర్జున్‌ ను అన్యాయంగా కేసులో ఇరికించడం వల్ల తమ కుటుంబ పరువు పోయిందంటూ 5 కోట్లకు పరువు నష్టం కేసు పెట్టారు.

అర్జున్‌ కుటుంబ సభ్యులు వేసిన కేసు చెల్లదంటూ శృతి హరిహరన్‌ కోర్టును ఆశ్రయించింది. తాజాగా విచారణ జరిపిన కోర్టు వారు వేసిన కేసు చెల్లదనేందుకు సరైన కారణాలు చెప్పని కారణంగా వారు వేసిన కేసు సాగుతుందని శృతికి కోర్టు షాక్‌ ఇచ్చింది. అర్జున్‌ కుటుంబ సభ్యులు వేసిన పరువు నష్టం కేసును విచారించేందుకు కోర్టు స్వీకరించింది. శృతికి కోర్టు కొంత గడువు ఇచ్చి పరువు నష్టం కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

కోర్టు ఇచ్చిన షాక్‌ తో శృతి హరిహరన్‌ కు ఏం చేయాలో పాలుపోవడం లేదట. అర్జున్‌ పై మీటూ ఆరోపణల కారణంగా ఆమెకు కన్నడనాట సినిమాలు కరువయ్యాయి. అర్జున్‌ తో రాజీకి కన్నడ సినీ పెద్దలు ఆమెతో చర్చలు జరిపినా వారి మాట వినలేదు. దాంతో ఆమెపై అనధికారికంగా బ్యాన్‌ కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది.