Begin typing your search above and press return to search.

ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న 'కలర్ ఫోటో'...?

By:  Tupaki Desk   |   28 Aug 2020 11:00 AM IST
ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్న కలర్ ఫోటో...?
X
హాస్యనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్‌ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ''కలర్ ఫోటో''. సీనియర్‌ కమెడియన్‌ సునీల్‌ ఈ సినిమాలో పూర్తి స్థాయి విలన్‌ గా కనిపించనున్నాడు. సుహాస్‌ కు జోడిగా తెలుగుమ్మాయి ఛాందినీ చౌదరి నటిస్తుండగా వైవా హర్ష ప్రధాన పాత్రలో కనిపిస్తున్నాడు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన 'కలర్ ఫోటో' చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై 'హృదయ కాలేయం' సాయి రాజేష్ నిర్మించారు. లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బెన్నీ ముప్పనేని సహ నిర్మాతగా వ్యవహరించారు. 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసిన సందీప్‌ రాజ్‌ దర్శకత్వం వహించాడు. కీరవాణి తనయుడు కాళ భైరవ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన 'కలర్ ఫోటో' ఫస్ట్ లుక్ మరియు టీజర్ విశేషంగా ఆకట్టున్నాయి.

కాగా ప్రస్తుతం థియేటర్స్ రీ ఓపెన్ చేసే పరిస్థితులు లేకపోవడంతో 'కలర్ ఫోటో' చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే టాలీవుడ్ లో క్రేజీ మూవీస్ ఓటీటీ బాట పడుతున్న తరుణంలో ఈ చిత్ర మేకర్స్ కూడా దీనికే మొగ్గుచూపుతున్నారట. ఈ నేపథ్యంలో టీజర్ తో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'లో విడుదల చేయడానికి సన్నాహకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే 'కలర్ ఫోటో' మూవీతో టాలీవుడ్ లో విల‌న్ గా బిజీ అవుదామ‌న‌కున్న సునీల్ కి.. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల ఆ ప్లాన్స్ వర్క్అవుట్ అవవేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.