Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ లైనప్ పై క్లారిటీ వచ్చినట్లేనా...?

By:  Tupaki Desk   |   2 Sep 2020 1:30 PM GMT
పవన్ కళ్యాణ్ లైనప్ పై క్లారిటీ వచ్చినట్లేనా...?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక హార్స్ పవర్‌ తో దూసుకుపోతున్నాడని చెప్పవచ్చు. జనసేన పార్టీ అధ్యక్షునిగా ఉన్న పవన్ కళ్యాణ్ 2019 ప్రత్యక్ష ఎన్నికలలో పాల్గొని సినిమాలకు దూరం అయ్యాడు. అయితే రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ మళ్ళీ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. సినిమాల్లోకి రీ ఎంట్రీ అని చెప్పడమే తరువాయి.. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌ లను ఓకే చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఈ క్రమంలో ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన ‘పింక్’ రీమేక్‌ గా వస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇదే ఊపులో డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ తో ఓ పీరియాడికల్ మూవీకి కమిట్ అయ్యాడు. దీంతో పాటు పవర్ స్టార్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు.

ఇదే క్రమంలో స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. పవన్ స్నేహితుడు రామ్ తాళ్లూరి ఎస్సార్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించనున్నాడని వార్తలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఏ మూవీ స్టార్ట్ చేస్తాడు అనే దానిపై కన్ఫ్యూజన్ ఏర్పడింది. ప‌వ‌న్ ఎవరికి ప్ర‌యారిటీ ఇవ్వ‌బోతున్నాడు?... 'వ‌కీల్ సాబ్' తర్వాత ప‌వ‌న్ తో సినిమా మొద‌లుపెట్ట‌బోతున్న ద‌ర్శ‌కులు ఎవరు?.. రేస్ లో ఉన్న క్రిష్ - హ‌రీశ్ శంకర్ - సురేంద‌ర్ రెడ్డి లలో ఎవ‌రితో ముందుగా ప‌వ‌న్ వ‌ర్క్ చేయబోతున్నాడనే స‌స్పెన్స్ నడిచింది. అయితే నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవర్ స్టార్ లైనప్ పై ఓ క్లారిటీ వచ్చింది.

ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగు పూర్తి చేసుకున్న 'వకీల్ సాబ్' తర్వాత క్రిష్ సినిమాలో పాల్గొంటాడని తెలుస్తోంది. ఇప్పటికే 15 రోజుల షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న PSPK27 సెట్స్ లో పవన్ త్వరలోనే అడుగుపెట్టనున్నాడని ప్రీ లుక్ పోస్టర్ తో అర్థం అయిపోయింది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో PSPK28 ప్రాజెక్ట్ తెరకెక్కనుందని మేకర్స్ కాన్సెప్ట్ పోస్టర్ తో వెల్లడించారు. దీంతో పవన్ కెరీర్లో 29వ చిత్రాన్ని సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తారని క్లారిటీ వచ్చింది. నిర్మాత రామ్ త‌ళ్లూరి ప‌వ‌న్ సినిమా ఉంద‌ని అఫీషియ‌ల్ గా అనౌన్స్ చేసిన పోస్టర్ లో PSPK29 అని ఎలాంటి నెంబ‌ర్ ప్రకటించలేదు. అయినప్పటికీ మిగతా సినిమాల విషయంలో క్లారిటీ రావడం వల్ల ఆ మూడు ప్రాజెక్ట్స్ పూర్తైన తర్వాతే ఈ మూవీ ఉంటుందని స్పష్టం అయింది. కాకపోతే కరోనా పరిస్థితుల కారణంగా రాబోయే రోజుల్లో ఈ లైనప్ లో ఏమైనా మార్పులు ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఈ గ్యాప్ లో ఏం జ‌రుగుతుందో చూడాలి.