Begin typing your search above and press return to search.

రజినీ మాటే వేదం అంటున్న చిరు

By:  Tupaki Desk   |   10 Jan 2017 1:16 PM IST
రజినీ మాటే వేదం అంటున్న చిరు
X
కెరీర్ ఆరంభంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశాడు చిరంజీవి. స్టార్ ఇమేజ్ సంపాదించాక కూడా కమర్షియల్ లెక్కలేసుకోకుండా రుద్రవీణ.. ఆపద్బాంధవుడు లాంటి సినిమాలతో మెప్పించాడు. కానీ ఓ దశ దాటాక మాత్రం చిరు ప్రయోగాల జోలికి పోలేదు. మాస్ మసాలా సినిమాలకే పరిమితం అయిపోయాడు. ఇప్పుడు చిరు రీఎంట్రీ మూవీ కూడా కమర్షియల్ లెక్కలేసుకుని చేసిన సినిమానే. ఐతే ప్రయోగాత్మక చిత్రాలు చేయడంలో ఒకప్పుడున్నంత ధైర్యం ఆ తర్వాత లేకపోవడానికి కారణం తన అభిమానులే అంటున్నాడు చిరు. తన నుంచి ప్రేక్షకులు ఏది ఆశిస్తారో అదివ్వడమే తన కర్తవ్యం అని చిరు చెప్పాడు.

ఈ విషయంలో ఒకసారి ఒక పెద్దావిడ చెప్పిన మాటలు.. మరో సందర్భంలో రజినీకాంత్ చెప్పిన సూచనలే తనను మార్చాయని చిరు వెల్లడించాడు. ‘‘డాడీ సినిమా చూసిన ఒక పెద్దావిడ నాతో మాట్లాడింది. మేం మా బాధల్ని మరిచిపోవడానికి నీ సినిమాకు వస్తాం.. నువ్వు మళ్లీ బాధపెట్టే సినిమాలు తీస్తే ఎలా? అని ఆమె ప్రశ్నించింది. నా సినిమాలు వినోదం కోసం చూస్తామని చెప్పింది. అలాగే రజినీ ఓ సందర్భంలో ‘మనకేం కావాలి అని ఆలోచించే కంటే ప్రేక్షకులు మన నుంచి ఏం ఆశిస్తున్నారో చూసి సినిమాలు ఎంచుకోవాలి’ అన్నాడు. అప్పట్నుంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. రుద్రవీణ.. స్వయం కృషి.. ఆపద్బాంధవుడు లాంటి సినిమాలు నటుడిగా నాకు సంతృప్తినిచ్చాయి. కానీ పక్కా కమర్షియల్ సినిమాలే నా అభిమానుల్ని ఎక్కువ సంతృప్తిపరుస్తుంటాయి. అందుకే ఆ తరహా సినిమాలకే ప్రాధాన్యమిస్తుంటా. అలాగని కొత్త తరహా సినిమాలు చేయనని కాదు. వాటిలోనూ వాణిజ్య అంశాలకు లోటు లేకుండా చూసుకోవాలి’’ అని చిరు అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/