Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ఏక్తా క‌పూర్ అనిపించుకుంటున్న సీనియర్ బ్యూటీ...!

By:  Tupaki Desk   |   17 July 2020 10:31 AM IST
టాలీవుడ్ ఏక్తా క‌పూర్ అనిపించుకుంటున్న సీనియర్ బ్యూటీ...!
X
సినీ అభిమానులకు సీనియర్ హీరోయిన్ - ప్రొడ్యూసర్ ఛార్మీ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 13 ఏళ్ల వయసులో హీరోయిన్‌ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కొన్నేళ్ల పాటు తన బ్యూటీతో టాలీవుడ్‌ ను ఊపేసింది. టాలీవుడ్ స్టార్ హీరోలందరితో నటించి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని అందం ఆమె సొంతం. ఛార్మింగ్ బ్యూటీ ఛార్మీ అంటే యూత్ లో ఇప్పటికీ యమ క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు మలయాళ కన్నడ హిందీ సినిమాలలో కూడా నటించింది. ఒకప్పుడు తన అందాలతో అలరించిన ఛార్మీ ఆ తర్వాత నిర్మాతగా మారి డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ తో కలిసి 'పూరీ కనెక్ట్స్‌' అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించింది.

'జ్యోతి లక్ష్మీ' 'పైసా వసూల్‌' వంటి చిత్రాలను నిర్మించి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకుంది. రామ్ పోతినేని - పూరీ కాంబినేషన్ లో వచ్చిన 'ఇస్మార్ట్‌ శంకర్‌' సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ ఇస్మార్ట్ సినిమాతో ఒక్కసారిగా ఇండ‌స్ట్రీలో మాస్ కంటెంట్ ని డిజైన్ చేసే స్ట్రాట‌జీ ప్లేయ‌ర్ అయిపోయింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ - అనన్య పాండే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమాని బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ - పూరీ జగన్నాథ్ లతో కలిసి నిర్మిస్తోంది ఛార్మి. ఇప్పటివరకు టాలీవుడ్ లోనే సినిమాలు నిర్మించిన ఛార్మీ ఇప్పుడు విజయ్ - పూరీ సినిమాతో బాలీవుడ్ మార్కెట్ పై గురి పెడుతోంది. నిజానికి సినీ ఇండస్ట్రీలో లేడీ ప్రొడ్యూసర్స్ అరుదుగా ఉంటారు. అందులోనూ సక్సెస్ అయిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో ఛార్మీ ఒకరని చెప్పవచ్చు.

అందుకే టాలీవుడ్ ప్రొడ్యూస‌ర్ గిల్డ్ మీటింగ్ కి కూడా రమ్మ‌ని ఛార్మీకి ఆహ్వానాలు అందుతున్నాయంట. దీన్ని బట్టే ఇండస్ట్రీలో ఈ బ్యూటీ రేంజ్ పెరిగిపోయింద‌ని అర్థం అవుతుంది. బాలీవుడ్ లో ప్రొడ్యూసర్ ఏక్తా క‌పూర్ ఎలాగో టాలీవుడ్ లో ఛార్మీ అలా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. బాలీవుడ్ లో ఏక్తా క‌పూర్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా సత్తా చాటుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఛార్మీ కూడా ప్రొడ్యూసర్ గా విజయాల పరంపర కొనసాగిస్తూ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా కంటిన్యూ అవుతుందేమో చూడాలి.