Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్ వ‌చ్చేస్తానంటున్న చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   1 Nov 2015 1:33 PM IST
హైద‌రాబాద్ వ‌చ్చేస్తానంటున్న చంద్ర‌బాబు
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ పరిపాలనను పూర్తిగా విజయవాడ నుంచే కొనసాగిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరిగి హైద‌రాబాద్ కేంద్రంగా ప‌రిపాల‌న కొన‌సాగించాలుకుంటున్నారా? త‌్వ‌ర‌లో ఈ మేర‌కు హైద‌రాబాద్‌ లో ఏర్పాట్లు రెడీ చేసి పెట్టుకుంటున్నారా? చంద్ర‌బాబు కొత్త ఆలోచ‌న వెన‌క ప్ర‌జా సంక్షేమంతో పాటు పార్టీ కోణం కూడా ఉందా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది.

నవంబర్‌ 15 తర్వాత వారంలో రెండు రోజుల పాటు హైదరాబాద్‌ లోనే బసచేసి సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు నిర్వహించాలని చంద్ర‌బాబు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం షురూ అయిన‌ వరంగల్ ఉప ఎన్నిక‌తో పాటు త్వ‌ర‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలు, నారాయణ్‌ఖేడ్‌ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు పూర్తిగా విజయవాడలోనే మకాం వేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయని పార్టీకి సంబందించి కీలకమైన ఏ అంశాలు చర్చించాలన్నా విజయవాడకు రావాల్సి వస్తుందని, దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని పలువురు పార్టీ సీనియర్లు చంద్రబాబును కలిసిన సందర్భంగా తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణలో హైదరాబాద్‌-సికింద్రాబాద్‌ జంట నగరాలు, పొరుగు జిల్లాల్లో ఉంటున్న సీమాంధ్రులు చంద్రబాబు పూర్తిగా విజయ వాడలోనే ఉంటూ అక్కడి నుంచి పాల‌నను కొన‌సాగించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారని సమాచారం.

హైదరాబాద్‌ లో ఉంటున్న తమకు రక్షణ కల్పించవల్సింది చంద్రబాబేన‌ని అలాంటిది ఆయన హైదరాబాద్‌ ను వదిలేసి విజయవాడలోనే బస చేస్తే తమ సమస్యలు, ఇబ్బందులు ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. జీహెచ్‌ ఎంసీ ఎన్నికలు తరుముకొస్తున్న ఈ సమయంలో చంద్రబాబు హైదరాబాద్‌ లో కనీసం వారంలో మూడు రోజులు ఉండటం శ్రేయస్కరమని ఏపీకి చెందిన పలువురు సీనియర్‌ మంత్రులు, పార్టీ నేతలు సైతం భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఒకటి రెండు సార్లు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారని, అందుకు చంద్ర‌బాబు కూడా సుముఖత వ్యక్తం చేశారని ప్రచారం జరుగుతోంది.

ఇవ‌న్నింటికీ తోడూ ప్రతి సమీక్షా సమావేశానికి హైదరాబాద్‌ నుంచి అధికారులు, సిబ్బంది విజయవాడకు రావల్సి వస్తోందని, దీని వల్ల రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమావేశానికి ఒకటి, రెండు రోజుల ముందు సమాచారం అందిస్తుండటంతో ఐఎఎస్‌ - ఐపీఎస్‌ అధికారులు - కార్యదర్శి - ఉప కార్యదర్శులు విమానయానం ద్వారా విజయవాడకు వెళ్లాల్సి వస్తోంది. ఒక్కో సమయంలో విమాన చార్జీ ధర రానుపోనూ రూ.15 వేల వరకు ఉంటోందని ఇలా ఒక శాఖ సమీక్షకు కనీసం 10 నుంచి 15 మంది అధికారులు, సిబ్బంది వెళ్లవలసి వస్తోందని, వీరందరికి ప్రభుత్వమే రానుపోను ఖర్చులు భరిస్తోందని సమాచారం. కొన్ని సందర్భాలలో విజయవాడ చేరుకున్నాక సమావేశం రద్దయినట్లు కబురుకూడా వస్తోందని, దీంతో అధికారులు అక్కడే స్థానిక హోటళ్లలో బస చేసి పెద్ద ఎత్తున బిల్లులు చెల్లిస్తున్నారని తెలుస్తోంది. ఇక నుంచి కీలకమైన, అత్యంత కీలకమైన సమావేశాలను విజయవాడలో నిర్వహించి శాఖల వారీగా సమీక్షలను హైదరాబాద్‌లో నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సీఎం చంద్రబాబు అధికారులతో ఆరా తీస్తున్నట్లు సమాచారం.