Begin typing your search above and press return to search.

డ్రగ్స్ కేసు: ప్రముఖ యాంకర్ కు నోటీసులు

By:  Tupaki Desk   |   25 Sep 2020 9:50 AM GMT
డ్రగ్స్ కేసు: ప్రముఖ యాంకర్ కు నోటీసులు
X
కర్ణాటకలో వెలుగుచూసిన శాండిల్ వుడ్ డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రముఖ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనలు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ కేసులో ప్రముఖ కన్నడ టీవీ యాంకర్ అనుశ్రీకి మంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

డ్రగ్స్ రవాణా కేసులో డ్యాన్సర్ కిశోర్ శెట్టిని మంగళూరు పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. అతడిని విచారించగా.. అనుశ్రీకి డ్రగ్స్ తో సంబంధం ఉన్నట్టు చెప్పినట్టు తెలిసింది. అందుకే ఆమెకు పోలీసులు నోటీసులు పంపారు. దీంతో ఈ డ్రగ్స్ మూలాలు టీవీ ఇండస్ట్రీకి కూడా పాకాయి.

కాగా తనకు నోటీసులు అందడంపై అనుశ్రీ స్పందించింది. 10 ఏళ్ల కిందట కిశోర్ శెట్టితో కలిసి డ్యాన్స్ చేశానని.. అంతే తప్ప అతడితో నాకు అంత పరిచయం ఏమీ లేదని ఆమె తెలిపింది. టీవీ యాంకర్ గా రాణించడంతోపాటు సినిమాల్లోనూ అనుశ్రీ నటిస్తోంది.

కాగా కిశోర్ శెట్టి బెంగళూరులో కార్తీక్ శెట్టి అనే నిందితుడితో కలిసి కాలేజీల వద్ద డ్రగ్స్ అమ్మేవాడని పోలీసుల విచారణలో తేలింది. కిశోర్ శెట్టి విచారణలో అనుశ్రీ పేరు బయటపడింది. అతడిని బెంగళూరుకు తీసుకొచ్చి విచారిస్తున్నారు.

బెంగళూరు నుంచే డ్రగ్స్ ను మంగళూరు, గోవాకు సరఫరా చేసినట్టు సీసీబీ పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ముఠా నాయకుడి కోసం గాలిస్తున్నారు. మాఫియా డాన్లతోనూ వీరికి సంబంధాలున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.