Begin typing your search above and press return to search.

గీత కాంపౌండ్ కౌంటర్ వచ్చేసింది

By:  Tupaki Desk   |   7 Jan 2019 9:55 AM GMT
గీత కాంపౌండ్ కౌంటర్ వచ్చేసింది
X
ఊహించినట్టే నిన్న పేట ఫంక్షన్ లో నిర్మాతలు ప్రసన్న-అశోక్ వల్లభనేని చేసిన కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. పేర్లను స్పష్టంగా చెబుతూ ఈ ఇద్దరు వెలిబుచ్చిన బాష మీద ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతోంది. రజనీకాంత్ అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయారు కానీ ఒకవేళ స్టేజి మీదే ఉండి ఈ కామెంట్స్ కనక విని ఉంటె ఖచ్చితంగా సమర్ధించేవారు కాదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరు నేరుగా దుమ్మెత్తిపోసిన వాళ్లలో దిల్ రాజుతో పాటు యువి సంస్థ మరియు అల్లు అరవింద్ లు ఉన్న సంగతి తెలిసిందే.

అయితే ఎవరు ముందుగా స్పందిస్తారు అని ఎదురు చూసిన దానికి సమాధానం వచ్చేసింది. గీతా కాంపౌండ్ నుంచి ఆ సంస్థ రెండో బ్యానర్ వ్యవహారాలు చూసుకుంటూ ఇటీవలే గీత గోవిందంతో హిట్ కొట్టిన నిర్మాత బన్నీ వాస్ తన ట్విట్టర్ లో స్పందించారు. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడిన ప్రసన్న కుమార్ ను ఉద్దేశించి హెచ్చరిస్తున్నట్టుగా మెసేజ్ పెట్టిన బన్నీ వాస్ తమ సహనం కోల్పోయే దాకా పరిస్థితిని తీసుకొస్తున్నారని సంస్కారం అనే హద్దును దాటితే పరిణామాలు వేరుగా ఉంటాయని నేరుగా వార్నింగ్ ఇచ్చేసారు.

నిర్మాత ప్రసన్న పేరును అందులో స్పష్టంగా పేర్కొనడంతో ఇక వాదోపవాదాలకు చర్చ లేకుండా పోయింది. సో బన్నీ వాస్ ఫస్ట్ మొదలుపెట్టాడు కాబట్టి ఇక దిల్ రాజు యువి సంస్థల నుంచి సమాధానం రావాల్సి ఉంది. అశోక్ ప్రసన్న వైఖరి మీద ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు బన్నీ వాస్ స్పందన ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి