Begin typing your search above and press return to search.

కుంటాల జలపాతాన్ని సందర్శించిన బన్నీ ఫ్యామిలీ.. ఎలా అనుమతిచ్చారు?

By:  Tupaki Desk   |   13 Sep 2020 7:50 AM GMT
కుంటాల జలపాతాన్ని సందర్శించిన బన్నీ ఫ్యామిలీ.. ఎలా అనుమతిచ్చారు?
X
కరోనా కారణంగా జనాలు ఒకప్పటిలా బయట తిరగటం లేదు. కాలు తీసి బయట పెట్టింది మొదలు ఎక్కడ ఎవరికి కరోనా వచ్చిందోనన్న భయంతోనే బతుకులు వెళ్లదీస్తున్నారు. సినీ సెలబ్రిటీలు అయితే షూటింగులు లేకపోవడంతో ఇళ్లకే పరిమితమయ్యారు. ఆరు నెలల నుంచి ఇంట్లోనే ఉంటూ తమ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ మధ్య ప్రభుత్వాలు లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం.. కరోనాతో ఇంకొన్నాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్న సెలబ్రిటీలు ధైర్యం చేసి బయటకు వస్తున్నారు. అల్లు అర్జున్ కూడా అప్పుడప్పుడు అలా కాలు బయటపెడుతున్నాడు. ఇటీవల గీతా ఆర్ట్స్ - డైరెక్టర్ మారుతి ఆఫీస్ ని విజిట్ చేసిన బన్నీ.. తన సతీమణి స్నేహరెడ్డితో కలిసి బయటకు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్‌ కుటుంబ సమేతంగా కుంటాల జలపాతాన్ని సందర్శించారు.

బన్నీ శనివారం భార్యా పిల్లలతో కలిసి కుంటాల జలపాతం జాలువారే అందాలను వీక్షించారు. బన్నీకి అటవీశాఖ అధికారులు దగ్గరుండి జలపాతం విశిష్టతను.. అక్కడి ప్రకృతి అందాల గురించి వివరించినట్లు తెలుస్తోంది. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణ శివారులో గల హరితవనం పార్కులో సఫారీలో తిరుగుతూ అందాలను తిలకించారు. హరితవనం పార్కులో మొక్కలు కూడా నాటారని తెలుస్తోంది. అయితే కరోనా నేపథ్యంలో జలపాతం వద్ద పర్యాటకులను అనుమతించని అటవీ శాఖ అధికారులు.. సినీ ప్రముఖులకు మాత్రం దగ్గరుండి జలపాతం అందాలను చూపిస్తూ మర్యాదలు చేయడం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నిర్మాత దిల్‌ రాజు కూడా కుటుంబంతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారని సమాచారం.