Begin typing your search above and press return to search.

సాహో ఎఫెక్ట్ తో జాన్ బడ్జెట్ అంత తగ్గిందా?

By:  Tupaki Desk   |   31 Dec 2019 5:43 AM GMT
సాహో ఎఫెక్ట్ తో జాన్ బడ్జెట్ అంత తగ్గిందా?
X
డార్లింగ్ ప్రభాస్ కెరీర్ 'బాహుబలి' ఫ్రాంచైజీకి ముందు.. తర్వాత అన్నట్టుగా తయారైంది. ప్రభాస్ సినిమాల స్థాయి పెరగడంతో పాటు.. ప్రభాస్ క్రేజ్ ను 'బాహుబలి' పూర్తిగా మార్చేసింది. 'బాహుబలి' స్థాయిని కొనసాగించాలనే ఉద్దేశంతో 'సాహో' కు భారీ బడ్జెట్ పెట్టారు. సినిమా భారీ వసూళ్లు సాధించినా.. హిందీ వెర్షన్ హిట్ అయినా.. ఓవరాల్ గా సినిమా మాత్రం నిరాశపరిచింది. దీంతో 'సాహో' ప్రభావం డార్లింగ్ తదుపరి చిత్రం 'జాన్' పై పడిందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయినా ఇప్పటికీ 'జాన్' టోటల్ బడ్జెట్ తక్కువేమీ కాదని భారీ స్థాయిలో ఉందని అంటున్నారు.

'జాన్' ను ప్రారంభించినప్పుడు భారీ స్థాయిలో.. ప్యాన్ ఇండియా ఫిలింగా ప్లాన్ చేశారట. యూరోప్ లో భారీ షెడ్యూల్స్ కూడా వేసుకున్నారు. అయితే 'సాహో' ఫలితం తర్వాత బడ్జెట్ విషయంలో కోత విధించారట. నిజానికి ఇప్పటివరకూ 'జాన్' కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. బడ్జెట్ ను సవరించిన తర్వాత మరో అరవై కోట్లలో సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారట. సినిమా బడ్జెట్ రూ. 160 కోట్లను ఎటువంటి పరిస్థితిలో దాటకూడదని ఒక పరిమితి విధించుకున్నారట.

సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్ ఉంది కాబట్టి ఆ బడ్జెట్ లో జాగ్రత్తగా సినిమాను పూర్తి చెయ్యగలరా లేదా అనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే 'సాహో' ఫలితం చూసిన తర్వాత ఈ సినిమాను తెలుగుకు మాత్రమే పరిమితం చేస్తారనే వెర్షన్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అయితే అదేమీ నిజం కాదట. ఈ సినిమాను కూడా ప్యాన్ ఇండియా ఫిలింగా విడుదల చేస్తారని సమాచారం. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.