Begin typing your search above and press return to search.

ప్రమోషన్స్ మొదలు పెడుతున్న జక్కన్న..!

By:  Tupaki Desk   |   30 May 2022 3:30 PM GMT
ప్రమోషన్స్ మొదలు పెడుతున్న జక్కన్న..!
X
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం 'ఆర్.ఆర్.ఆర్' మూవీ సక్సెస్ జోష్ లో ఉన్నారు. ఈ మల్టీస్టారర్ ని జనాల్లోకి తీసుకెళ్లడానికి జక్కన్న ఏ రేంజ్ లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అగ్ర దర్శకుడు ఇప్పుడు మరోసారి ప్రమోషన్స్ మొదలు పెట్టబోతున్నారు. కాకపోతే ఈసారి నిర్మాతగా మారి వేరే డైరెక్టర్ తీసిన సినిమా కోసం ప్రచారం చేయబోతున్నారు.

బాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కుతున్న ''బ్ర‌హ్మాస్త్ర'' చిత్రానికి రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సోషియో ఫాంటసీ అడ్వెంచర్ మూవీలో రణబీర్ కపూర్ - అలియా భట్ - అమితాబ్ బ‌చ్చ‌న్ - మౌనీరాయ్‌ ప్ర‌ధాన పాత్రలో నటించారు. ఇందులో కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో కనిపించనున్నారు.

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ని ''బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ'' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో 2022 సెప్టెంబ‌ర్ 9న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

ఇప్పటికే 'బ్రహ్మాస్త్ర' సినిమా గ్లిమ్స్ మరియు 'కేసరియా' పాట మంచి స్పందన తెచ్చుకున్నాయి. అలానే 'కుంకుమలా' అంటూ తెలుగు వెర్షన్ సాంగ్ ను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ క్రమంలో మాగ్నమ్ ఓపస్ ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ వైజాగ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు.

రేపు మంగళవారం (మే 31) ఉదయం 11:30 గంటల నుంచి మెలోడీ థియేటర్ లో 'బ్రహ్మాస్త్ర పార్ట్ వన్: శివ' ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవెంట్‌ జరగనుంది. దీనికి ఎస్ఎస్ రాజమౌళి - హీరో రణబీర్ కపూర్ మరియు దర్శకుడు *అయాన్ ముఖర్జీ హాజరు కానున్నారని సమాచారం.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సమర్పకుడిగా ఉండటంతో పాటుగా అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటించడం వల్ల తెలుగు ప్రేక్షకుల్లోనూ ''బ్రహ్మాస్త్ర'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ - ప్రైమ్ ఫోకస్ బ్యానర్స్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రీతమ్ సంగీతం సమకూర్చారు.