Begin typing your search above and press return to search.

టాలీవుడ్ సినిమాలకు నిర్మాతలుగా బాలీవుడ్ హీరోలు..!

By:  Tupaki Desk   |   19 April 2020 2:30 AM GMT
టాలీవుడ్ సినిమాలకు నిర్మాతలుగా బాలీవుడ్ హీరోలు..!
X
ప్రస్తుతం మన తెలుగు సినిమాలు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదిస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం సౌత్ లోనే తన ప్రభావాన్ని చూపేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమా ఇప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీతో పాటు నార్త్ లో కూడా తన హవా చూపిస్తోంది. గతేడాది విడుదలైన ప్రభాస్ 'సాహో' సినిమానే తీసుకుంటే.. ఈ సినిమా తెలుగులో కంటే బాలీవుడ్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. కలెక్షన్స్ వైజ్ చూసుకున్నా కూడా బాలీవుడ్ సినిమాలకు పోటీగా వసూళ్లు రాబట్టింది. దీన్ని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది ఇతర ఇండస్ట్రీలలో మన సినిమాల స్టామినా.

రాజమౌళి తీసిన 'బాహుబలి' సినిమాల తర్వాత ఈ పరిస్థితి వచ్చింది అనడంలో సందేహం లేదు. ఈ సినిమా తర్వాత అన్ని ఇండస్ట్రీలలో తెలుగు సినిమా ముఖ చిత్రమే మారిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం మన స్టార్ హీరోలు తమ సినిమాలను ధైర్యంగా పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసుకుంటున్నారు. మన తెలుగు సినిమాల మార్కెట్ ఆ స్థాయికి చేరింది. సినిమాల కంటెంట్ పరంగా చూసుకున్నా మన సినిమాలు అన్ని ఇండస్ట్రీలకి పోటీగా నిలుస్తున్నాయి. టాలీవుడ్ లో విడుదలయ్యే సినిమాలను రీమేక్ చేయడం కోసం బాలీవుడ్ నిర్మాతలు వెయిట్ చేస్తూ ఉంటారు. మన సినిమాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. మన సినిమాలు అక్కడ రీమేక్ చేయబడి బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తున్నాయి. అంతెందుకు ఇక్కడ డిజాస్టర్స్ గా మిగిలిన సినిమాలను డబ్ చేసి వదిలితే టీవీలకు అతుక్కొనిపోయి చూస్తున్నారు అక్కడి జనాలు. అదీ ప్రస్తుతం తెలుగు సినిమా అంటే.

ఈ నేపథ్యంలో ఇప్పుడు మన తెలుగు సినిమాల మీద బాలీవుడ్ దృష్టి పెడుతోంది. ఇక్కడి సినిమాల్లో పెట్టుబడి పెట్టడానికి బాలీవుడ్ నిర్మాతలతో పాటు హీరోలు కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ వస్తున్నారట. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరించడానికి ముందుకు వస్తున్నారట. ఇప్పటికే కరణ్ జోహార్ - బోణీ కపూర్ లాంటి నిర్మాతలు ఇక్కడ కూడా పాగా వేయడానికి చూస్తున్నారు. అంతేకాకుండా అక్కడి సినిమాలను నిర్మించడానికి మన నిర్మాతలు కూడా ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు ఎక్కువగా చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా అక్కడి హీరోలు కూడా మన సినిమాలను ప్రొడ్యూస్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పుడు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమాలకు నిర్మాతలు గా వ్యవహరించాలని అక్కడి హీరోలు భావిస్తున్నారని టాలీవుడ్ లో ఇప్పుడు టాక్ వినపడుతోంది.