Begin typing your search above and press return to search.

బిగ్ అనౌన్స్ మెంట్: మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో '#SSMB28'

By:  Tupaki Desk   |   1 May 2021 12:22 PM GMT
బిగ్ అనౌన్స్ మెంట్: మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో #SSMB28
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరూ కలిసి చేసింది రెండు సినిమాలే అయినా అవి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మాత్రం చాలా ఎక్కువ. అందుకే వీరి కాంబోలో మరో మూవీ వస్తే చూడాలని ఫ్యాన్స్ పదకొండేళ్ళుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మహేష్ - త్రివిక్రమ్ కలయికలో హ్యాట్రిక్ మూవీ రానుందని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ నిజం చేస్తూ ఎన్నాళ్ళుగానో ఊరిస్తూ వస్తున్న '#SSMB28' ప్రాజెక్ట్ ని నేడు మే డే సందర్భంగా అధికారికంగా ప్రకటించారు.

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ కాంబో 11 ఏళ్ల తర్వాత ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం కలుస్తున్నారని చెబుతూ ఓ వీడియో ద్వారా '#SSMB28' అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌ పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మహేష్ బాబు కోసం త్రివిక్రమ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు అలరించే పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు మేకర్స్ తెలిపారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చానున్నారు. దీనికి సంబంధించిన తారాగణం సాంకేతిక నిపుణుల వివరాలు తర్వాత వెల్లడిస్తారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని.. 2022 సమ్మర్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. మహేష్ కొత్త ప్రాజెక్ట్ ప్రకటన రావడంతో ఖుషీలో ఉన్న ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ చేస్తున్నారు.

కాగా, మహేశ్ - త్రివిక్రమ్ కాంబోలో ఇంతకుముందు 2005లో ‘అతడు’.. 2009లో ‘ఖలేజా’ సినిమాలు వచ్చాయి. ఇందులో ‘అతడు’ విజయం సాధించగా.. ‘ఖలేజా’ మాత్రం నిరాశపరిచింది. కానీ ఈ రెండు సినిమాలు ఎప్పుడు టీవీలో వచ్చినా ప్రేక్షకులు ఛానల్ మార్చకుండా చూస్తుంటారు. వీటిలో మహేష్ ని సరికొత్తగా ఆవిష్కరించిన త్రివిక్రమ్.. అతనిలోని కంప్లీట్ కామెడీ యాంగిల్ ని బయటకు తీశాడు. ఇప్పుడు ఇదే క్రమంలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాలో కూడా మహేష్ క్యారక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ హీరో మహేష్ - డైరెక్టర్ త్రివిక్రమ్ కలయికలో వస్తున్న '#SSMB28' పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.