Begin typing your search above and press return to search.

మహేష్ బాబు టీం మళ్లీ గిల్లిందిగా..

By:  Tupaki Desk   |   29 Nov 2017 9:40 AM GMT
మహేష్ బాబు టీం మళ్లీ గిల్లిందిగా..
X
అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య’ షూటింగ్ మొదలైనపుడే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మధ్య మహేష్ బాబు కొత్త సినిమా ‘భరత్ అను నేను’ టీం తమ సినిమాను కూడా అదే రోజుకు రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడం టాలీవుడ్లో కలకలం రేపింది. ఓ పెద్ద సినిమాను ఒక డేటుకి ఫిక్స్ చేశాక.. ఇలా లేటుగా వచ్చి పోటీకి దిగడం ఏం సంప్రదాయమన్న ప్రశ్నలు తలెత్తాయి. ముందు డేట్ ఫిక్స్ చేసుకుంది తామే కాబట్టి ఆ డేటు విషయంలో తగ్గేదే లేదని ‘నా పేరు సూర్య’ టీం సభ్యుడు బన్నీ వాసు స్పష్టం చేశాడు. తమను ఓసారి సంప్రదించి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఉండాల్సిందని అతను అభిప్రాయపడ్డాడు.

బన్నీ వాసు అలా అన్న కొన్ని రోజులకు ‘నా పేరు సూర్య’.. ‘భరత్ అను నేను’ నిర్మాతల మధ్య ఒక మీటింగ్ జరిగిందని.. చర్చలు ఫలవంతం అయ్యాయని.. ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని.. అప్పటి పరిస్థితిని బట్టి సర్దుబాటు చేసుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ ఈ రెండు టీంల మధ్య అవగాహన ఏమీ కుదరలేదని తెలుస్తోంది. ఎందుకంటే మహేష్ బాబు సినిమా కొత్త షెడ్యూల్స్ గురించి వివరాలు ప్రకటిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. అందులో మళ్లీ ఏప్రిల్ 27న రిలీజ్ అనే స్టాంప్ మళ్లీ కనిపించింది. ఈ చిత్ర పీఆర్వో దీన్ని షేర్ చేస్తూ.. ఏప్రిల్ 27న రిలీజ్ అనే విషయాన్ని ధ్రువీకరించారు. మరి ‘నా పేరు సూర్య’ టీం తాము రిలీజ్ డేట్ మార్చుకుంటామని వీళ్లకు సమాచారం ఇవ్వడంతో వీళ్లు ఇలా మళ్లీ డేట్ అనౌన్స్ చేశారా.. లేక ఆ చిత్ర బృందాన్ని గిల్లడానికి మళ్లీ ఇలా ప్రకటన ఇచ్చారా అన్నది తెలియడం లేదు. రెండో మార్గంలోనే వెళ్తున్నట్లయితే ఈ వ్యవహారం వివాదంగా మారేందుకు ఆస్కారముంది.