Begin typing your search above and press return to search.

అందాల రాశీ ఖన్నాకు 8 ఏళ్ళు..!

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:37 AM GMT
అందాల రాశీ ఖన్నాకు 8 ఏళ్ళు..!
X
'మద్రాస్ కేఫ్' అనే హిందీ సినిమాతో వెండితెరకు పరిచయమైన అందాల తార రాశీఖన్నా.. 'మనం' మూవీలో గెస్ట్ రోల్ లో మెరిసింది. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఈ క్రమంలో వరుస అవకాశాలు అందిపుచ్చుకుని.. అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రాశీ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది.

రాశీ ఖన్నా నటించిన ఫస్ట్ తెలుగు సినిమా సక్సెస్ అయినప్పటికీ.. వెంటనే వచ్చిన 'జోరు' మూవీ నిరాశ పరిచింది. ఆ తర్వాత 'జిల్' 'శివమ్' 'బెంగాల్ టైగర్' 'సుప్రీమ్' 'హైపర్' 'జై లవకుశ' వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది. ఇదే క్రమంలో మలయాళ తమిళ చిత్రాల్లోనూ ఆఫర్స్ అందుకుంది. దానికి తగ్గట్టుగానే ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఆ తర్వాత రోజుల్లో నాజూగ్గా మారింది.

తెలుగులో 'ఆక్సిజన్' 'టచ్ చేసి చూడు' 'శ్రీనివాస కల్యాణం' వంటి సినిమాలు రాశీఖన్నా ని నిరాశపరిచినప్పటికీ.. 'తొలిప్రేమ' 'వెంకీమామ' 'ప్రతిరోజూ పండుగే' వంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకుంది. కాకపోతే ఎన్నో ఆశలు పెట్టుకున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' మూవీ ప్లాప్ అవడంతో.. ఎక్కువ శాతం తమిళ చిత్రాలకే పరిమితం కావాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ బ్యాక్ టూ రెండు తెలుగు సినిమాలతో పలకరించడానికి రెడీ అయింది.

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్యతో రాశీ కలిసి నటించిన 'థాంక్యూ' సినిమా జూలై రెండో వారంలో రిలీజ్ కాబోతోంది. అలానే గోపీచంద్ - మారుతీ లతో చేసిన 'పక్కా కమర్షియల్' మూవీ జులై 1న విడుదల కానుంది. వీటితోపాటుగా మూడు తమిళ సినిమాలు - ఒక హీరో చిత్రం మరియు ఒక వెబ్ సిరీస్ రాశీ లైనప్ లో ఉన్నాయి.

అయితే 2014లో టాలీవుడ్ లో అడుగుపెట్టిన అందాల రాశీ ఖన్నా.. ఇండస్ట్రీలో 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో #8YrsForRaashiiInTFI అభిమానులు ఆమె అపురూపమైన ప్రయాణం గురించి పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన రాశీ.. ప్రేక్షకుల ఆదరాభిమానాలు లేకుంటే ఇన్నేళ్ల ఇన్క్రెడిబుల్ జర్నీ సాధ్యమయ్యేది కాదని.. అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాని ఇన్స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది.

టాలీవుడ్ లో ఈ 8 ఏళ్లలో ఎన్టీఆర్ - రవితేజ - నాగచైతన్య - రామ్ పోతినేని - నితిన్ - గోపీచంద్ - సాయి ధరమ్ తేజ్ - నాగశౌర్య - సందీప్ కిషన్ - విజయ్ దేవరకొండ వంటి హీరోల సరసన రాశీఖన్నా హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం తమిళ్ లో కార్తీ 'సర్దార్' - ధనుష్ 'తిరుచిత్రంబలం' సినిమాలు చేస్తోంది రాశీ.

అలానే దాదాపు పదేళ్ల తర్వాత 'యోధ' అనే సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇక అజయ్ దేవగన్ తో కలిసి 'రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌ నెస్‌' అనే క్రైమ్‌ థ్రిల్లర్‌ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా.. షాహిద్ కపూర్ 'ఫర్జి' సిరీస్ లో భాగం కాబోతోంది. ఇలా అమ్మడు ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ తో కెరీర్ లో ముందుకు సాగుతోంది.