Begin typing your search above and press return to search.

తలసేమియా బాధితులకు అండగా ఉందామంటున్న బాలయ్య...!

By:  Tupaki Desk   |   1 Oct 2020 12:30 PM IST
తలసేమియా బాధితులకు అండగా ఉందామంటున్న బాలయ్య...!
X
సీనియర్ స్టార్ హీరో, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారనే విషయం తెలిసిందే. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతో మంది కేన్సర్ రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల కరోనా విపత్కర సమయాల్లో కూడా హాస్పిటల్ తరపున తనవంతు సహాయం చేశారు. కరోనా వైరస్ సోకకుండా కాపాడే వ్యాధినిరోధక శక్తి పెంచే మెడిసిన్ అందజేసారు. హోమియో పిల్స్, విటమిన్ టాబ్లెట్స్ సినీ ఇండస్ట్రీలోని 24 క్రాఫ్ట్స్ లోని సాంకేతిక నిపుణులందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి మంచి మనసు చాటుకున్నారు. ఇప్పుడు తాజాగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారికి అండగా నిలబడటానికి ముందుకు వచ్చాడు బాలయ్య.

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత మరియు ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో నిర్వహిస్తున్న బ్లడ్ క్యాంపుకు వచ్చి రక్తదానం చేయాలని బాలయ్య పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తలసేమియా వ్యాధి గురించి వివరిస్తూ.. రక్త దానం పట్ల ప్రచారంలో ఉన్న పలు అపోహలను తొలగించారు. 'ఎంత అభివృద్ధి చెందినా రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడం సాధ్యం కాదు కనుక.. తోటివారి ప్రాణాలను కాపాడడానికి మనకు ఉన్న ఒకే ఒక్క ఆయుధం రక్తదానం మాత్రమే' అని బాలయ్య పేర్కొన్నాడు. అందుకే అభిమానులు, కార్యకర్తలు, ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి.. తోటివారి ప్రాణాలను కాపాడాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.