Begin typing your search above and press return to search.

దండం పెడుతున్న ప్రేక్షకులు

By:  Tupaki Desk   |   25 Nov 2018 1:30 AM GMT
దండం పెడుతున్న ప్రేక్షకులు
X
మామూలుగా దర్శకత్వం నటన తదితర అంశాల్లో శిక్షణ ఇచ్చే ఫిలిం స్కూల్స్ లో ఇకపై సినిమాలు ఎలా తీయకూడదు అని సిలబస్ లో పెడితే కనక ఖచ్చితంగా ఈ ఏడాది వచ్చిన కొన్ని తెలుగు సినిమాలు మహాద్భుతంగా ఉపయోగపడతాయి. అసలు ఫిలిం మేకింగ్ మీద కనీస అవగాహన లేకుండా తీస్తున్నారో లేదా తాము రాసుకున్న కథ మీద అతి ఆత్మవిశ్వాసమో తెలియదు కానీ వీటి తాలూకు ప్రభావానికి ప్రేక్షకులు స్టార్లు లేని కొత్త సినిమా ఏదైనా వచ్చింది అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. నిన్న విడుదలైన 24 కిస్సెస్ యునానిమస్ గా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో కనీసం ప్రీ రిలీజ్ కు పెట్టిన ఖర్చైనా తిరిగి వస్తుందా అంటూ అప్పుడే సోషల్ మీడియాలో జోకులు మొదలయ్యాయి.

అలా అని ఇదే మొదటిది కాదు. చివరిది కాబోదు కూడా. దీని కన్నా కొద్దిరోజుల ముందు వచ్చిన రవిబాబు అదుగో జనం సాధారణంగా అసహ్యించుకునే పంది లాగే సినిమా కూడా తిరస్కరణకు గురైంది. అంతకు ముందు పదే పదే కల్ట్ అని ప్రచారం చేసుకున్న వీర భోగ వసంత రాయలు సాయంత్రం ఆటకే టపా కట్టేసింది. అసలు ఇది సినిమానేనా అంటూ బయటికి వచ్చిన ప్రేక్షకులు ప్రశ్నించుకోవడం దీని విషయంలోనే జరిగింది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. స్టార్లు సైతం దీనికి మినహాయింపు కాదు. రెండో వారంలోకి అడుగు పెట్టిన అమర్ అక్బర్ ఆంటోనీకి చాలా చోట్ల షోలు రద్దవుతున్న మాట వాస్తవం. వివి వినాయక్ లాంటి అనుభవం ఉన్న దర్శకుడు వదిలిన ఇంటెలిజెంట్ అనే ఆణిముత్యం హీరోను ఏకంగా అమెరికా వెళ్ళిపోయి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకునేలా చేసింది. ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కరుణాకరన్ తేజ్ ఐ లవ్ యు గురించి మాట్లాడకపోతే బెటర్.

ఇందరు తీయగా లేనిది నేనేం తక్కువా అంటూ రామ్ గోపాల్ వర్మ నాగ్ తో తీసిన ఆఫీసర్ కనీసం కోటి రూపాయల షేర్ కూడా తేలేక అభిమానుల చేత ఛీ కొట్టించుకుంది. నాని కృష్ణార్జున యుద్ధం ఫలితం సరేసరి. పూరి మెహబూబా మరో మాస్టర్ పీస్. ఈ ప్రవాహం ఇక్కడితో ఆగేది కాదు కానీ ఇలాంటి సినిమాలు తీస్తున్న వాళ్ళలో కొత్త దర్శకులు మొదలుకుని సీనియర్లు కూడా ఉండటం సినిమా ప్రేమికులను బాధ పెట్టె విషయం. ఇకనైనా తాము రాసిందే వేదం అనుకోకుండా కాస్త స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే టీవీలో వచ్చినా ప్రేక్షకులు పట్టించుకోరు.