Begin typing your search above and press return to search.

ఆ నిర్మాత న‌రకం చూపించాడు!

By:  Tupaki Desk   |   9 Oct 2018 12:16 PM GMT
ఆ నిర్మాత న‌రకం చూపించాడు!
X
ప్ర‌స్తుతం `#మీ టూ` ఉద్య‌మం దేశవ్యాప్తంగా పెను ప్ర‌కంప‌న‌లు రేపుతోన్న సంగ‌తి తెలిసిందే. గ‌తంలో తాము అనుభ‌వించిన లైంగిక వేధింపుల‌పై కొంత‌మంది తార‌లు పెద‌వి విప్పుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు ఆ న‌టీమ‌ణుల‌కు మ‌ద్ద‌తుగా నిల‌వాల్సిందిపోయి....వారిపైనే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఎపుడో ఐదేళ్లు....ప‌దేళ్ల క్రితం జ‌రిగిన లైంగిక వేధింపుల గురించి ఇపుడు ఎందుకు బ‌య‌ట‌పెడుతున్నార‌ని ఎదురుదాడి చేస్తున్నారు. అటువంటి వారికి స‌మాధానంగా న‌టి ఫ్లోరా షైనీ(ఆశా షైనీ) త‌న ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆవేద‌న పూరిత పోస్టు పెట్టింది. 2007లో ఓ నిర్మాత త‌న‌ను లైంగికంగా వేధించ‌డ‌మే కాకుండా దారుణంగా కొట్టాడ‌ని, ఆ విష‌యాన్ని తాను బ‌య‌ట‌పెట్టినా ఎవ్వ‌రూ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌లేద‌ని చెప్పింది. అంతేకాకుండా, ఆ నిర్మాత త‌న ప‌లుకుబ‌డి ఉప‌యోగించి త‌న‌కు సినిమా అవ‌కాశాలు రాకుండా చేశాడ‌ని, త‌న‌ను నానా ఇబ్బందులకు గురి చేశాడ‌ని ఆరోపించింది.

న‌ర‌సింహ‌నాయుడులో బాల‌కృష్ణ స‌ర‌స‌న `ల‌క్స్ పాప` ...అంటూ స్టెప్పులేసిన ఫ్లోరా షైనీ ప‌లు తెలుగు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్ర‌స్తుతం ` #మీ టూ` ఉద్య‌మం తీవ్ర‌త‌రం అవుతున్న నేప‌థ్యంలో త‌న చేదు అనుభ‌వాల‌ను ఆమె వెల్ల‌డించింది. 2007లో గౌరంగ్ దోషి అనే నిర్మాత త‌న‌న దారుణంగా కొట్టాడ‌ని, సంవత్సరం పాటు నరకం చూపించాడ‌ని త‌న‌ ఫేస్‌ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది. ఆనాడు మొహం అంతా గాయాలతో కమిలిపోయిన ఫొటోల‌ను పోస్ట్ చేసింది. ఆ నాడే గౌరంగ్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌పెట్టిన‌ప్ప‌టికీ...త‌న‌కు మ‌ద్ద‌తు ద‌క్క‌లేద‌ని వాపోయింది. కేవ‌లం త‌న ప్రతిభ చూసి అవకాశాలు ఇచ్చే వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి తలదాచుకోవాలని అనుకున్నాన‌ని చెప్పింది. అత‌డి ప‌లుకుబ‌డికి భ‌య‌ప‌డి త‌న‌ను ఆడిషన్స్‌ కు కూడా పిలవడానికి ఇష్టపడేవాళ్లు కాద‌ని, అత‌డిపై ఫిర్యాదు చేసి తాను తప్పు చేశానని అనిపించింద‌ని తెలిపింది. గౌరంగ్‌ వల్ల త‌న‌ జీవితంలో చాలా నష్టపోయాన‌ని, ఆ ఘ‌ట‌న త‌ర్వాత త‌న జీవితంలో బాగుచేయలేని మార్పులు జ‌రిగాయ‌ని వాపోయింది. త‌న లాగే చాలామంది గౌరంగ్ వ‌ల్ల కష్టాలు ప‌డ్డార‌ని తెలిపింది. ఇపుడు `#మీటూ`కు మ‌ద్ద‌తు తెలుపుతున్నాన‌ని, లైంగిక వేధింపుల‌పై గ‌ళ‌మెత్తుతున్న‌వారు నిజ‌మైన హీరోల‌ని తెలిపింది.