Begin typing your search above and press return to search.

ఐదు భాష‌లు.. నాలుగు వేల స్క్రీన్ లు

By:  Tupaki Desk   |   16 March 2022 5:30 PM GMT
ఐదు భాష‌లు.. నాలుగు వేల స్క్రీన్ లు
X
`జేమ్స్‌`.. క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ ( అప్పూ) న‌టించిన చివ‌రి చిత్ర‌మిది. ఈ చిత్రం కోసం యావ‌త్ దేశ వ్యాప్తంగా వున్న సినీ ల‌వ‌ర్స్ భాష‌తో సంబంధం లేకుండా ఎదురుచూస్తున్నారు. క‌న్న‌డ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇటీవ‌ల గుండె పోటు రావ‌డంతో హ‌ఠాత్తుగా మృతి చెందిన విష‌యం తెలిసిందే.

దేశ వ్యాప్తంగా ఆయ‌న మ‌ర‌ణం అభిమానుల్ని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అభిమానులు అప్పూ న‌టించిన చివ‌రి చిత్రం `జేమ్స్‌` కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

మార్చి 17 పునీత్ రాజ్ కుమార్ జ‌యంతి సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన చివ‌రి చిత్రం `జేమ్స్`ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. ఐదు భాష‌ల్లో 4000 థియేట‌ర్ల‌లో ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ విడుద‌ల‌వుతోంది.

పునీత్ అంటే తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌ భాష‌ల‌కు చెందిన స్టార్ హీరోలు ఇష్ట‌ప‌డ‌తారు. వారితో పునీత్ కు మంచి సంబంధాలు కూడా వున్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్, ప్ర‌భాస్ ల‌తో అప్పూకు మంచి సాన్నిహిత్యం వుంది.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలో దివంగ‌త హీరో పునీత్ రాజ్ కుమార్ భ‌ద్ర‌తా సంస్థ‌లో మేనేజ‌ర్ గానూ, సైన్యాధికారిగానూ రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టించారు. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రానికి చేత‌న్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కిషోర్ ప‌త్తికొండ నిర్మించిన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించ‌డానికి రెడీ అవుతోంది. సినిమాలో ఒక పాట‌, యాక్ష‌న్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ బ్యాలెన్స్ గా వున్న స‌మ‌యంలోనే పునీత్ రాజ్ కుమార్ హ‌ఠాత్తుగా గుండె పోటుతో మృతి చెందారు.

ఇక పునీత్ పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌లేదు. దీంతో ఆయ‌న పాత్ర‌కు వేరే వాళ్ల‌తో డ‌బ్బింగ్ చెప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశారు కానీ చివ‌రికి పునీత్ అన్న‌య్య శివ‌రాజ్ కుమార్ చేత డ‌బ్బింగ్‌ చెప్పించారు. `జేమ్స్‌` ఓ యాక్ష‌న్ మూవీ. దీనికి ర‌వివ‌ర్మ స్టంట్‌ డైరెక్ట‌ర్ గా ప‌ని చేశార‌ట‌. అయితే చాలా వ‌ర‌కు పోర‌టా ఘ‌ట్టాల‌ని పునీత్ రాజ్ కుమార్ స్వ‌యంగా కంపోజ్ చేశార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ర‌వివ‌ర్మ‌నే చెప్ప‌డం విశేషం. తెలుగు హీరో శ్రీ‌కాంత్ ఇందులో విల‌న్ గా న‌టించారు.

ఈ మూవీ విడుద‌ల తేదీ నుంచి మార్చి 22 వ‌ర‌కు ఏ చిత్రాన్ని విడుద‌ల చేయ‌రాద‌ని క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌, ఎగ్జిబిట‌ర్స్‌, డిస్ట్రీబ్యూట‌ర్లు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ మూవీ విడుద‌ల సంద‌ర్భ‌హంగా బెంగ‌ళూరులోని మెజిస్టిక్ థియేట‌ర్లో పునీత్ రాజ్ కుమార్ 91 అడుగుల క‌టౌట్ ని ఏర్పాటు చేయ‌బోతుండ‌టం విశేషం. ఇప్ప‌టికే అడ్వాన్స్ బుకింగ్స్ ప‌రంగా టికెట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయ‌ట‌.