Begin typing your search above and press return to search.

టాలీవుడ్ హీరోలకు ఆంధ్రా పోలీస్ - వైద్య సిబ్బంది కనిపించడం లేదా...?

By:  Tupaki Desk   |   15 April 2020 11:30 PM GMT
టాలీవుడ్ హీరోలకు ఆంధ్రా పోలీస్ - వైద్య సిబ్బంది కనిపించడం లేదా...?
X
కంటికి కనిపించని కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. రోజురోజుకీ మృతుల సంఖ్య.. బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రభుత్వాలు అయోమయానికి గురవుతున్నాయి. ప్రజలు 'కరోనా' అనే పేరు వింటేనే భయపడిపోతున్నారు. సాధారణ జలుబు, తుమ్ములు దగ్గులు వచ్చినా కూడా కరోనా సోకిందేమో అని కంగారు పడిపోతున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ కరోనా మహమ్మారి ప్రభావం ఎక్కువగానే ఉంది... మరణాల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ప్ర‌భుత్వం ఇప్పటికే విధించిన లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించింది. కరోనా బాధితులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్ప‌టికే పలు స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నాయి. వారితో పాటు సినీ ప్ర‌ముఖులు, సెలబ్రిటీలు కూడా ప్రజలకు వివిధ రూపాల్లో సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. తమకు తోచిన విధంగా విరాళాలు అందిస్తున్నారు.

కొంతమంది వీడియోల ద్వారా కరోనా వ్యాప్తి నివారణకి కృషి చేస్తున్నారు. వారిలో యువ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కూడా ఉన్నారు. విజయ్ ఇప్పటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేదు. కానీ గ‌త వారం రోజులు నుంచి తెలంగాణ పోలీస్ సిబ్బందితో స్వ‌యంగా మాట్లాడుతూ వాళ్ల‌ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మ‌రో యువ హీరో నిఖిల్ కూడా గాంధీ ఆసుప‌త్రిలో డాక్ట‌ర్స్ కు, తెలంగాణ ప్రాంతంలోని పోలీసులకు ప్రొట‌క్ష‌న్ కిట్స్ అందిస్తూ తన వంతు సహాయం చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ లాంటి హీరోలు కూడా వీడియోల ద్వారా వారి సేవలను మెచ్చుకున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ ఆంధ్రలో కూడా ఎంతో మంది పోలీస్, వైద్య సిబ్బంది చాలా క‌ష్ట‌ప‌డుతున్నారు. మ‌రి వారికి తెలంగాణ సిబ్బంది మాదిరిగా స్టార్స్ తో స్పెష‌ల్ ఇంట్రాక్ష‌న్ లు లేవు. వారిని ఎంకరేజ్ చేసే హీరోలు లేరని చెప్పవచ్చు.

నిజానికి విజ‌య్ దేవ‌ర‌కొండే స్వ‌యంగా తెలంగాణ పోలీస్ వారిని క‌లిసి తన ప్లాన్ చెప్పి వివిధ ఏరియాల్లో ఉన్న పోలీస్ సిబ్బందితో వీడియో కాన్ఫెరెన్సెస్ ద్వారా మాట్లాడాడ‌ని తెలిసింది. మరి ఆంధ్ర సిబ్బందిని ఎంకరేజ్ చేయ‌డానికి ఒక్క హీరో కూడా ఎందుకు ముందుకు రావ‌డం లేదో అనే ప్రశ్న ఇప్పుడు ఆంధ్రా ప్రజల్లో వచ్చింది. అంటే వారికి 'హైద‌రాబాద్'ని కలిగియున్న తెలంగాణ రాష్ట్రంతో ఉన్న అటాచ్మెంట్ ఆంధ్ర‌తో లేదా అంటూ కొందరు నెటిజ‌న్స్ కామెంట్ చేస్తున్నారు. వీడియో కాన్ఫెరెన్సెస్ అంటే ఇంటి నుంచి క‌ద‌ల‌కుండానే చేసే పనే క‌దా..మరి ఈ హీరోలు ఎందుకు ఆంధ్రా సిబ్బందిని పట్టించుకోవడం లేదు. పోనీ ఓ వీడియో మెసేజ్ ఇచ్చి అది పోలీస్.. వైద్య సిబ్బందికి ఫార్వర్డ్ చేయొచ్చు కదా.. ట్విట్టర్ లోనో పేస్ బుక్ లోనో పోస్ట్ చేయొచ్చు కదా.. వారు అనుకోవాలే కానీ ఏదొకటి చేయొచ్చు. టాలీవుడ్ హీరోల సినిమాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు చూస్తుంటారు కదా.. మరి వాళ్ళని వీరు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.