Begin typing your search above and press return to search.

ర‌జ‌నీ అన్నాథే సెట్స్ లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ దేనికి?

By:  Tupaki Desk   |   1 April 2021 9:00 AM GMT
ర‌జ‌నీ అన్నాథే సెట్స్ లో వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ దేనికి?
X
సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య స‌మ‌స్య‌ల గురించి తెలిసిందే. 2.0 సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఒక‌సారి ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురవ్వ‌డం అభిమానుల్లో క‌ల‌క‌లం రేపింది. ఆ త‌ర్వాత చికిత్స కోసం ర‌జ‌నీ అమెరికా వెళ్లారు. ఒత్తిడిని అధిగ‌మించేందుకు హిమాల‌యాల యాత్ర‌కు వెళ్లి సేద దీరారు. గత ఏడాది డిసెంబర్ లో అన్నాథే షూటింగ్ స‌మ‌యంలోనూ స‌మ‌స్య రిపీటైంది. ఆయ‌న‌ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ చేస్తుండ‌గా అస్వ‌స్థ‌త‌కు గురై ఆసుపత్రిలో చేరారు. అయితే అందరికీ ఉపశమనం కలిగించే విధంగా రజినీ త్వరగా కోలుకొని తిరిగి చెన్నైకి వెళ్లారు. కొన్ని నెలల విశ్రాంతి తర్వాత రజనీ ఇటీవల ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నాథే షూటింగ్ ను తిరిగి ప్రారంభించారు.

చెన్నైలోని ఒక ఫిల్మ్ స్టూడియోలో అన్నాథే షూటింగ్ జరుగుతోంది. కోలీవుడ్ సర్కిల్స్ నుండి వస్తున్న తాజా స‌మాచారం ప్రకారం.. సెట్స్ లో రజిని ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి వైద్యుల బృందాన్ని నియమించారు. మహమ్మారి సెకండ్ వేవ్ నేప‌థ్యంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ని తెలిసింది. పైగా వేసవి వ‌డ‌గాల్పుల‌ను దృష్టిలో ఉంచుకుని ఆయ‌న‌కు స్పెష‌ల్ ట్రీట్ ఇస్తున్నార‌ని తెలిసింది. నిజానికి వైద్య బృందం అందుబాటులో ఉండ‌డం అన్న‌ది తెలివైన ఆలోచ‌న అని అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నయనతార- కీర్తి సురేష్ ఈ చిత్రంలో క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా.. ద‌రువు శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ‌ నిర్మిస్తోంది. దీపావళి సంద‌ర్భంగా సినిమా విడుదల కానుంది.