Begin typing your search above and press return to search.

అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ పై అల్లు శిరీష్ స్పందన..!

By:  Tupaki Desk   |   20 Oct 2022 12:30 AM GMT
అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ పై అల్లు శిరీష్ స్పందన..!
X
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శిరీష్.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే విధంగా సినిమాలు చేస్తున్నారు. పెద్ద సినీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. కమర్షియల్ సినిమాలు - స్టార్ డైరెక్టర్ల వెనుక పరుగులు తీయకుండా కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అయితే సినిమాల నుండి దాదాపు రెండేళ్లకు పైగా విరామం తీసుకున్న శిరీష్.. ఇప్పుడు 'ఊర్వశివో రాక్షసివో' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

'ఏబీసీడీ' సినిమా తర్వాత అల్లు శిరీష్ సోషల్ మీడియాకు కూడా కాస్త దూరంగా ఉంటూ వచ్చాడు. అంతేకాదు టాలీవుడ్ లో కంటే ముంబైలోనే ఎక్కువగా కనిపిస్తుండటంతో అనేక ఊహాగానాలు వినిపించాయి. మధ్యలో 'విలాయతి శరాబ్‌' అనే హిందీ మ్యూజిక్ ఆల్బమ్ తో పలకరించడంతో.. బాలీవుడ్ పై ఫోకస్ పెడుతున్నాడేమో అని కూడా అనుకున్నారు. అంతేకాదు బాంబేలో 'అల్లు ఎంటర్టైన్మెంట్స్' పనులు చూసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శిరీష్.. ముంబైలో ఎక్కువ సమయం గడపడానికి గల కారణాన్ని తెలిపారు.

ప్రొడ్యూసర్ కొడుకైన అల్లు శిరీష్ సినిమాల్లోకి రాకముందు నుంచే ఇనోవేటివ్ గా ఆలోచిస్తూ వచ్చాడు. అప్పట్లోనే 'నాన్ స్టాప్' అనే తన ఫ్రెండ్స్ తీసుకొచ్చిన వెబ్ సైట్ కు సపోర్ట్ గా నిలిచినా అల్లు వారబ్బాయి.. గీతా ఆర్ట్స్ కు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ - 'గజినీ' 3డి వీడియో గేమ్ - 'జల్సా' మొబైల్ గేమ్ వంటివి రూపొందించడంలో ముఖ్య పాత్ర పోషించారు. అలానే 'సౌత్ స్కోప్' అనే సెలబ్రిటీ మ్యాగజైన్ ను కూడా నిర్వహించారు. తర్వాతి రోజుల్లో దాన్ని వేరే వాళ్ళకి అమ్మేసినట్లుగా శిరీష్ తెలిపారు.

హైదరాబాద్ నుంచి పూర్తిగా తానేమీ ముంబైకి షిఫ్ట్ అవ్వలేదని అల్లు శిరీష్ చెప్పారు. ప్రస్తుతం తన తండ్రితో పాటుగానే ఉంటున్నానని.. అక్కడికి ఇక్కడికి వెళ్లొస్తున్నాని అన్నారు. నెలలో 20 రోజులు అక్కడ 10 రోజులు ఇక్కడ ఉంటూ వస్తున్నాను.. హైదరాబాద్ లో తక్కువ ఉండటం వల్ల ఏవేవో గాసిప్స్ వచ్చాయని పేర్కొన్నారు. బాంబేలో ఎందుకు ఉండాల్సి వచ్చిందనే దానిపై స్పందిస్తూ.. అక్కడ తన ఫ్రెండ్స్ తో కలిసి ఓ వెంచర్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

ఆ వెంచర్ కోసమే ముంబైలో ఉండాల్సి వచ్చిందని.. అది పూర్తవ్వడానికి కాస్త సమయం పడుతుందని చెప్పారు. లాక్ డౌన్ లో టైం దొరకడంతో దాని మీద దృష్టి పెట్టానే తప్ప.. సినిమాలు వదిలేయలేదని శిరీష్ స్పష్టం చేసారు. ఫ్యామిలీతో అంతా సరిగ్గా లేదని.. తండ్రితో దూరం పెరిగిందని.. అందుకే ముంబైలో ఉంటున్నాడనే రూమర్స్ ని కొట్టి పారేసాడు. తన ఫాదర్ తో చాలా క్లోజ్ గా ఉంటానని.. ప్రతీ రోజూ మెసేజులు ద్వారా టచ్ లో ఉంటామని.. వారానికి నాలుగైదు సార్లు మాట్లాడుకుంటామని తెలిపారు.

తన తండ్రి ఏ విషయమైనా ఫ్యామిలీలో ఫస్ట్ షేర్ చేసుకునేది తనతోనే అని.. అసలు అలాంటి రూమర్స్ ఎలా వస్తాయో అర్థం కావడం లేదని అన్నారు. ఈ సందర్భంగా గత కొంతకాలంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో డేటింగ్ చేస్తున్నారనే రూమర్స్ పైనా శిరీష్ స్పందించారు. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నప్పుడు అలాంటివి రావడం కామన్ అని సింపుల్ గా చెప్పేసారు. 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్ లో షాట్స్ చూసి అలా అనుకొని ఉండొచ్చని.. అంతేకానీ తాము డేటింగ్ చేయడం లేదని శిరీష్ స్పష్టం చేసారు. తదుపరి ప్రాజెక్ట్స్ పై మాట్లాడుతూ ఇంకా ఏదీ లాక్ చేయలేదని తెలిపాడు.

ఇకపోతే, అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటించిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా రిలీజ్ కు రెడీ అయింది. నవంబర్ 4న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. రాకేష్ శశి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్ పై నిర్మించారు. ఇది 'ప్యార్ ప్రేమ కాదల్' అనే తమిళ చిత్రానికి రీమేక్. ఇప్పటి వరకూ విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా శిరీష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.