Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా మూవీ అనిపించుకోడానికి 'పుష్ప' పడుతున్న పాట్లు..!

By:  Tupaki Desk   |   12 April 2020 2:30 AM GMT
పాన్ ఇండియా మూవీ అనిపించుకోడానికి పుష్ప పడుతున్న పాట్లు..!
X
ఈ ఏడాది ప్రారంభంలో 'అల వైకుంఠపురంలో' సినిమాతో మంచి హిట్ కొట్టిన అల్లు అర్జున్ అదే ఊపుతో స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ తో సినిమా పట్టాలెక్కించేసాడు. బన్నీ - సుక్కు కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్‌ను ప్రకటించారు. ఈ చిత్రానికి 'పుష్ప' అనే టైటిల్ ఖరారు చేసి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్‌లో అదరగొట్టారు. రాయలసీమకు చెందిన మొరటు కుర్రాడిగా బన్నీ డీగ్లామర్ లుక్ కేక పుట్టిస్తుంది. ‘పుష్ప' ఫస్ట్ లుక్ పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉండబోతోందనే వార్తలను నిజం చేస్తూ ఫస్ట్ లుక్ లో ఆ అంశాలు ఉండేలా రిలీజ్ చేసారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడినట్లుగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్థం అవుతోంది. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తున్నాడు. ఇది ఒక ఎమోషనల్ రివేంజ్ డ్రామాగా ఉండబోతోందని సమాచారం. ఇక ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో విడుదల కానుంది.

ఈ చిత్రంతో బన్నీ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న నేపథ్యంలో క్యాస్టింగ్ కూడా భారీగా పలు పరిశ్రమలకు చెందినవారిని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ మూవీలో విలన్ గా బాలీవుడ్ నుండి తీసుకుకొనే ఆలోచనలో ఉన్నాడట సుకుమార్. ముఖ్యంగా సీనియర్ హీరోలు అయిన సంజయ్ దత్, సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లలో ఎవరినో ఒకరిని ఒప్పించి తీసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాకుండా ఈ చిత్రంలో ఒక ఐటెం సాంగ్ కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీని సంప్రదిస్తున్నారని సమాచారం. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్ ఒక మాస్ నెంబర్ రెడీ చేసి సుక్కుకు వినిపించాడట. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ పాటలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోందట. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. తమిళ నటుడు విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ కీలక రోల్ చేస్తుండగా ఆయన పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. లెక్కల మాస్టర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో బ‌న్నీకి జోడీగా లక్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న న‌టిస్తోంది. ఈ సినిమాకు సుక్కు ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.