Begin typing your search above and press return to search.

1500 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లేనా..?

By:  Tupaki Desk   |   10 Dec 2020 11:30 AM GMT
1500 కోట్ల డ్రీమ్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టినట్లేనా..?
X
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ 1500 కోట్ల బడ్జెట్ తో ''రామాయణం'' ప్రాజెక్ట్‌ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతిహాస రామాయణం ఆధారంగా రూపొందే ఈ చిత్ర నిర్మాణంలో ప్రముఖ నిర్మాతలు మధు మంతెన - నమిత్ మల్హోత్ర కూడా భాగస్వాములు అయ్యారు. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారి మరియు 'మామ్' ఫేమ్ రవి ఉద్యవార్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించనున్నారని వెల్లడించారు. పలు భారతీయ బాషల్లో మూడు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్ర మొదటి భాగం 2021లో విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే కారణాలు తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుండి మరో అప్డేట్ రాలేదు. డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పుకున్న అల్లు అరవింద్ కూడా ఈ దీని గురించి ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు 'రామాయణం' ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

ఇతిహాస గాథ 'రామాయణం' ని ఆధారంగా చేసుకుని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'ఆదిపురుష్' అనే పాన్ ఇండియా మూవీని అనౌన్స్ చేశాడు. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించనున్నారు. అలానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ 'రామ్ సేతు' అనే మరో సినిమాని ప్రకటించాడు. దీంతో ఇప్పుడు అల్లు అరవింద్ అనౌన్స్ చేసిన 'రామాయణం' ఆలోచనను విరమించుకున్నారని అంటున్నారు. ప్రస్తుతం మెగా ప్రొడ్యూసర్ పూర్తిగా 'ఆహా' ఓటీటీ మీద ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. నిజానికి అల్లు అరవింద్ నిర్మించే 'రామాయణం' లో ప్రభాస్ - హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె వంటి స్టార్స్ నటించనున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకి కమిట్ అయ్యాడు. మరి హృతిక్ రోషన్ వంటి స్టార్ హీరో ఈ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తే ఈ మెగా ప్రాజెక్ట్ కార్యరూపం దాలుస్తుందేమో చూడాలి.