Begin typing your search above and press return to search.

దసరా తరువాతే 'దృశ్యం 2

By:  Tupaki Desk   |   28 Sep 2021 2:30 AM GMT
దసరా తరువాతే దృశ్యం 2
X
విక్టరీ వెంకటేష్ హీరోగా మలయాళ డైరెక్టర్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''దృశ్యం 2''. ఇది 'దృశ్యం' సినిమాకు సీక్వెల్.. ఈ ఏడాది ప్రారంభంలో ఓటీటీలో విడుదలైన మోహన్ లాల్ 'దృశ్యం 2' చిత్రానికి అధికారిక రీమేక్. ఇందులో వెంకీ భార్యగా సీనియర్ హీరోయిన్ మీనా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తారా? లేదా థియేట్రికల్ రిలీజ్ కు వెళ్తారా? అనే దానిపై మేకర్స్ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు.

అయితే వెంకటేష్ నటించిన 'నారప్ప' బాటలోనే ''దృశ్యం 2'' చిత్రాన్ని కూడా డైరెక్ట్ ఓటీటీ విధానంలో విడుదల చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అదే నిజమని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ముందుగా థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపిన మేకర్స్.. ఫ్యాన్సీ ఆఫర్ రావడంతో ఓటీటీ విడుదలకు వెళ్తున్నట్లు చెప్పుకుంటున్నారు. 'నారప్ప' ను తీసుకున్న అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీయే.. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

దసరా కానుకగా 'దృశ్యం 2' చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి పెట్టే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ మాతృక కూడా ఇదే ఫ్లాట్ ఫార్మ్ లో ప్రసారమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం విజయ దశమి తరువాతే ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేస్తారని తెలుస్తోంది. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన ఇస్తారేమో చూడాలి.

కాగా, 'దృశ్యం 2' వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా. 'దృశ్యం' ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ఈ సినిమా మొదలవుతుంది. పోలీసులు తిరగదోడిన పాత కేసు వల్ల రాంబాబు ఫ్యామిలీ ఎలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది?.. తమ తెలివితేటలతో ఎలా బయటపడ్డారు? అనే అంశాలతో థ్రిల్లింగ్ గా ఈ కథ చెప్పబోతున్నారు. ఈ చిత్రంలో ఎస్తర్ అనీల్ - కృతికా - సంపత్ నంది - పూర్ణ - నదియా - నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

సురేష్ ప్రొడక్షన్స్ - మాక్స్ మూవీస్ - రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై 'దృశ్యం 2' రూపొందుతోంది. డి.సురేష్ బాబు - ఆంటోనీ పెరుంబవూర్ - రాజ్ కుమార్ సేతుపతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. సతీష్ కురూప్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు.