Begin typing your search above and press return to search.

సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత ఉండక్కర్లేదా..!

By:  Tupaki Desk   |   5 Nov 2020 2:30 AM GMT
సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత ఉండక్కర్లేదా..!
X
ప్రజల ఆదరాభిమానాలతో కళాకారులు - క్రీడాకారులు సెలబ్రిటీలుగా గుర్తింపు పొందుతుంటారు. అయితే ఆ అభిమానాన్ని మరలా సొమ్ము చేసుకోవటానికి కొందరు సెలబ్రిటీలు వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ ఉంటారు. హీరో హీరోయిన్స్ సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సెలబ్రిటీలు ప్రమోట్ చేసే ఉత్పత్తుల వల్లనో యాప్స్ వల్లనో ఇతరుల జీవితాలు ఎఫెక్ట్ అవుతుంటాయి. సెలబ్రెటీలు కొందరు క్రికెట్ మరియు ఆన్ లైన్ గేమింగ్ తో పాటు ఆన్లైన్ రమ్మీలను ప్రమోట్ చేసే యాప్స్ కి కూడా అడ్వర్టైజ్ మెంట్స్ ఇస్తున్నారు. 'ఆన్లైన్ రమ్మీ గేమ్స్ ఆడండి.. ఇంట్లోనే కూర్చొని డబ్బులు గెలవండి' అంటూ ఇండైరెక్ట్ గా బెట్టింగ్ ని ప్రమోట్ చేస్తున్నారు. దీంతో ఒకప్పుడు బయటకి వెళ్లి జూదం ఆడేవారు కాస్తా ఇప్పుడు ఇంట్లోనే కూర్చొని ఆడుతున్నారు. కేవలం వీటి వల్లనే డబ్బును కోల్పోయి ఎన్నో జీవితాలు నాశనమైన ఘటనలు మనం చాలానే విన్నాం. అందుకే ఈ యాప్స్ ని బ్యాన్ చేయాలని నిరసనలు కూడా వ్యక్తం అయ్యాయి.

ఇప్పటికే ఆన్ లైన్ రమ్మీ వంటి పలు జూదానికి సంబంధించిన యాప్స్ ని తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ లతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో నిషేధించడం జరిగింది. మరికొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో ఆల్కహాల్ ని ప్రమోట్ చేస్తూ యాడ్స్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత లేదా.. డబ్బుల కోసం ఎలాంటి యాడ్స్ చేయడానికైనా రెడీ అయిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ లేకుండా ప్రజల జీవితాలతో ఆటలాడుకునే ఇలాంటి ఆటలను ప్రమోట్ చేసి.. వాటిని ఎంకరేజ్ చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. వీరు కూడా తమ వంతు సామాజిక బాధ్యతతో మెలిగి ఇలాంటి జూదాలకు యాప్స్ ని లిక్కర్ ని ప్రమోట్ చేయకుండా ఉంటే బాగుంటుందని సూచిస్తున్నారు.

కాగా, చెన్నైకి చెందిన ఓ న్యాయవాది ఆన్ లైన్ గేమింగ్ యాప్స్ మీద, వాటిని ప్రమోట్ చేస్తున్న వారి మీద మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రజలను జూదం వైపు ప్రభావితం చేస్తున్న వీటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని.. అలాగే వీటికి ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న వారు కూడా వివరణ ఇవ్వాలని పిటిషనర్ కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆన్ లైన్ గేమింగ్ మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలానే వీటికి ప్రచారకర్తలుగా వ్యవహరించిన రానా - తమన్నా - సుదీప్ - ప్రకాష్ రాజ్ - కోహ్లీ - గంగూలీ వంటి స్టార్స్ వివరణ ఇవ్వాలని వారికి నోటీసులు జారీ చేసింది. ఇది మంచి పరిణామమనే చెప్పుకోవాలి. ఇప్పటి నుంచైనా సెలబ్రిటీలు ప్రజలకు నష్టం కలిగించే వాటికి ప్రచారకర్తలుగా వ్యవహరించాలంటే కొంచెం ఆలోచించే పరిస్థితి వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.