Begin typing your search above and press return to search.

జాను: వసూలు చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత!

By:  Tupaki Desk   |   11 Feb 2020 6:45 AM GMT
జాను: వసూలు చేసింది గోరంత.. చేయాల్సింది కొండంత!
X
సమంతా-శర్వానంద్ ప్రధాన పాత్రలలో నటించిన ప్రేమకథా చిత్రం 'జాను'. ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచి క్లాసిక్ స్టేటస్ అందుకున్న సినిమా కావడంతో తెలుగు రీమేక్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి వ్యక్తం అయింది కానీ సినిమాకు మాత్రం మిశ్రమ స్పందన దక్కింది. కలెక్షన్స్ కూడా నిరాశాజనకంగా ఉన్నాయి.

మొదటి వారాంతంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 6.60 కోట్ల రూపాయల షేర్ సాధించింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా రూ. 19 కోట్లు. ఈలెక్కన బ్రేకీవెన్ అయ్యేందుకు 'జాను' షుమారుగా మరో 12 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి లో ఈ సినిమా ఆ స్థాయి లో వసూలు చేయలేదని ఈ సినిమాకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాల వారి అభిప్రాయం. ఫుల్ రన్ లో ఈ సినిమా 12 కోట్లు వసూలు చేసే అవకాశం లేనే లేదని అంటున్నారు. ఓవరాల్ గా బయ్యర్లకు నష్టాలు మాత్రం తప్పేలా లేవు.

ఇదిలా ఉంటే హీరో శర్వానంద్ కు ఇది హ్యాట్రిక్ డిజాస్టర్ అయ్యేలా ఉంది. 'జాను' కు ముందు శర్వా నటించిన 'పడి పడి లేచే మనసు'.. 'రణరంగం' రెండూ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచాయి. మరో సినిమా కనుక డిజాస్టర్ అయితే మాత్రం శర్వా కెరీర్ కూడా ప్రమాదం లో పడుతుందనే టాక్ వినిపిస్తోంది. 'జాను' సినిమా కూడా ఎక్కువ గా సమంతా పేరు మీదే బిజినెస్ జరిగింది కాబట్టి ఆ రేంజ్ లో థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయి. శర్వానంద్ తన కెరీర్ విషయంలో.. కథల ఎంపిక లో మరింత జాగ్రత్త వహించడం అవసరం అనే అభిప్రాయం వినిపిస్తోంది.