ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారేమో కానీ..
డెవిల్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ.
By: Tupaki Desk | 7 April 2025 12:28 PMడెవిల్ సినిమా తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ. ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తోంది. ఏప్రిల్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ముందుగా ఈ సినిమాకు అసలు పెద్దగా హైపే లేదు. కానీ ఎప్పుడైతే సినిమా నుంచి టీజర్ రిలీజైందో మూవీపై ఒక్కసారిగా బజ్ పెరిగింది. ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమాకు మంచి క్రేజ్ వచ్చేసింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా కళ్యాణ్ రామ్ మూవీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడిస్తున్నాడు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా క్లైమాక్స్ ఎంతో గొప్పగా ఉంటుందని, 20 నిమిషాల పాటూ సాగే ఈ క్లైమాక్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, ఇప్పటివరకు తెలుగులో ఇలాంటి క్లైమాక్స్ రాలేదని, సినిమా హైలైట్స్ లో మేజర్ హైలైట్ క్లైమాక్సేనని, ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తే సినిమాపై ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారేమో కానీ ఇది మాత్రం నిజమని కళ్యాణ్ రామ్ తెలిపాడు.
తెలుగు సినిమాలో ఇలాంటి సీన్స్ ఎప్పుడూ చూసి ఉండరని, అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా క్లైమాక్స్ చూశాక ఆడియన్స్ కదిలిపోతారని, తల్లిని ఇష్టపడే ప్రేమించే ప్రతీ కొడుకు కళ్లల్లో సినిమా కన్నీళ్లు తెప్పిస్తుందని, తన కెరీర్ లో ఇప్పటివరకు ఇలాంటి స్టోరీ, సినిమాను చేయలేదని కళ్యాణ్ రామ్ చెప్తున్నాడు.
ఇక సినిమాలో విజయశాంతి, కళ్యాణ్ రామ్ కు తల్లిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ నటనను చూసి ప్రతీ ఒక్కరూ ఇంప్రెస్ అవుతారని విజయశాంతి ఇప్పటికే ప్రమోషన్స్ లో తెలిపింది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.