సినీ పరిశ్రమ ఏపీకి తరలి రావాలి: మంత్రి కందుల
హైదరాబాద్ నుంచి సినీపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాల్సి ఉందని సంచలన ప్రకటన చేసారు పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్.
By: Tupaki Desk | 14 April 2025 10:21 AM ISTహైదరాబాద్ నుంచి సినీపరిశ్రమ ఆంధ్రప్రదేశ్ కి తరలి రావాల్సి ఉందని సంచలన ప్రకటన చేసారు పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ప్రభుత్వం కొత్త చలనచిత్ర విధానంపై పని చేస్తోందని, దీనిని త్వరలో ప్రకటిస్తామని మంత్రివర్యులు తాజా ప్రకటనలో వెల్లడించారు. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్ థియేటర్స్ ఏర్పాటుకు రాయితీతో కూడిన స్థలాలను కేటాయిస్తామని, ఏపీలో సినిమాలు నిర్మించే సంస్థలకు రాయితీలు ఇస్తామని కూడా మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
విజయవాడలోని శేష సాయి కల్యాణ వేదికలో వారాహి ఆర్ట్స్ - శక్తి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన `వెస్ట్రన్ లవ్` చిత్రానికి క్లాప్ కొట్టిన తర్వాత మీడియాతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రంలో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ కట్టుబడి ఉన్నారని అన్నారు.
రాష్ట్రం లో షూటింగ్లకు అనువైన ప్రదేశాలు అందుబాటులో ఉన్నాయని, అయితే ఏపీలోను చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని, ఉన్న స్టూడియోలు నిరుపయోగంగా పడి ఉన్నాయని మంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున షూటింగ్లు జరుగుతున్నా కానీ, అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని ఆయన అంగీకరించారు.
హైదరాబాద్లో ఉన్నట్లే స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్లు, రీ-రికార్డింగ్ సౌకర్యాలు సహా సరైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు అన్నారు. అభివృద్ధి చెందుతున్న చలనచిత్ర పరిశ్రమ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. సినీపరిశ్రమ ఏపీకి తరలి రావాలని కోరారు కానీ, ఎక్కడికి తరలి రావాలో మంత్రివర్యులు స్పష్ఠంగా వెల్లడించలేదు. అన్ని ఘనమైన ప్రకటనల మాదిరిగానే, ఇది కూడా మరొక డిప్లమాటిక్ ప్రకటన కాకూడదని ప్రజలు ఆశిస్తున్నారు.
