మరో డేట్ తో అనుష్క ‘ఘాటీ’.. ఇప్పటికైనా ఫైనల్ చేస్తారా?
అనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటీ’ సినిమా టాలీవుడ్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. ‘వేదం’ సినిమా తర్వాత మరోసారి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఆమె చేతులు కలిపింది.
By: Tupaki Desk | 2 Jun 2025 12:27 PM ISTఅనుష్క శెట్టి నటిస్తున్న ‘ఘాటీ’ సినిమా టాలీవుడ్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారింది. ‘వేదం’ సినిమా తర్వాత మరోసారి దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో ఆమె చేతులు కలిపింది. ఈ యాక్షన్ క్రైమ్ డ్రామా గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. అనుష్క ఒక ట్రైబల్ మహిళగా, ఆ తర్వాత క్రిమినల్ మాస్టర్మైండ్గా మారే పాత్రలో కనిపించనుంది.
విక్రమ్ ప్రభు, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను UV క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ఐదు భాషల్లో విడుదల కానుంది. అయితే ‘ఘాటీ’ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయింది, కానీ రిలీజ్ డేట్ విషయంలో నిరంతరం గందరగోళం నెలకొంది. మొదట ఏప్రిల్ 18న విడుదల చేస్తామని ప్రకటించిన టీమ్, ఆ తర్వాత మే నెలకు వాయిదా వేసింది.
అయితే, విజువల్ ఎఫెక్ట్స్లో ఆలస్యం, ఇతర సాంకేతిక సమస్యలతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. అసలే క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి తప్పుకుని ‘ఘాటీ’ని త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నాడు, కానీ ఆ ఆలోచన వర్కౌట్ కాలేదు. లేటెస్ట్ గా, ‘ఘాటీ’ సినిమా జులై 11న విడుదల చేయాలనే ఆలోచనలో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట.
అయితే డేట్ గురించి లీక్స్ రావడంతో ఇకనైనా ఫైనల్ చేస్తారా అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఈసారి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందా అనే సందేహం అభిమానుల్లో ఉంది. ఈసారి టీమ్ ఆలస్యం చేయకుండా సినిమాను విడుదల చేస్తే, అనుష్క ఫ్యాన్స్కు పండగలా ఉంటుందని అంటున్నారు.
సినిమా బజ్ విషయంలో టీమ్ ఇప్పటివరకు అంతగా సక్సెస్ కాలేదు. అనుష్క బర్త్డే సందర్భంగా విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, సినిమాపై చర్చలు జరిగే స్థాయిలో హైప్ రాలేదు. ఈ నేపథ్యంలో జులై 11 రిలీజ్ డేట్తో పాటు టీమ్ ప్రమోషన్స్ను జోరుగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కథలో అనుష్క ఒక బాధితురాలి నుంచి క్రిమినల్ మాస్టర్మైండ్గా మారే పాత్రలో కనిపించనుంది. ఎమోషన్ తో కథను నడిపే క్రిష్ కు ఇది ఒక బిగ్ చాలెంజ్. మరి అతనికి సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.
