పబ్లిక్ రోడ్పై యూట్యూబర్ చెలగాటం.. ఇది ఆత్మహత్యాయత్నమా?
కొద్దిరోజులుగా యూట్యూబ్ యుకే07 రైడర్ అలియాస్ అనురాగ్ దోభల్ కులాంతర వివాహం, కుటుంబ రచ్చ అంతర్జాలంలో చర్చగా మారింది.
By: Sivaji Kontham | 8 March 2026 10:41 AM ISTకొద్దిరోజులుగా యూట్యూబ్ యుకే07 రైడర్ అలియాస్ అనురాగ్ దోభల్ కులాంతర వివాహం, కుటుంబ రచ్చ అంతర్జాలంలో చర్చగా మారింది. అతడు తన కులాంతర వివాహానికి నిరాకరించిన తల్లిదండ్రులు పెళ్లికి ముందు తనను టార్చర్ చేసారని ఆరోపించాడు. పిచ్చెక్కినట్టు డిప్రెషన్ తో కనిపించాడు. తాను పలుమార్లు సూసైడ్ కి ప్రయత్నించానని కూడా చెప్పాడు.
అయితే ఇప్పుడు ఏకంగా పబ్లిక్ రోడ్ పై కార్ లో గంటకు 150కి.మీల వేగంతో ర్యాష్ డ్రైవ్ చేస్తూ పబ్లిక్ కి ప్రాణాంతకంగా మారాడు. అతడు ఇదే నా చివరి రైడ్ అంటూ కార్ ని ఇష్టానుసారం తిప్పాడు. అతడు వెళుతున్న తీరు గమనిస్తుంటే, ఆపోజిట్ లో వస్తున్న కార్లను అతడు ఢీకొడితే ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసిన వారికి గుండెల్లో గుబులు పుట్టింది. ఒక రకమైన భయోత్సాతం క్రియేట్ చేసాడు అతడు.
అయితే ఈ వ్యవహారం అంతా చూస్తున్న వాళ్లు యూట్యూబర్ చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. కుటుంబంలో గొడవలు ఉంటే వాళ్లు వాళ్లు చూస్కోవాలి.. కానీ ఇలా పబ్లిక్ రోడ్ పైకి వచ్చి ఇతర ప్రజలకు ప్రాణహానిగా మారితే దానికి ఎలాంటి శిక్షలు అమలు చేయాలి? అతడు సూసైడ్ చేసుకుంటే అది అతడి కర్మకు సంబంధించినది... దానికి రోడ్లపై వెళ్లే ఇతరులను బలి చేయాలా? ఇతర వాహనదారుల జీవితాలను రిస్కులో వేయడానికి అతడు ఎవరు? అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అతడు చేసినది దారుణమైన ఎటెంప్ట్. కాబట్టి దానికి తగ్గ శిక్షలు పడాలని నెటిజనులు బలంగా కోరుకుంటున్నారు.
అత్యంత దారుణం:
ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కొన్ని లక్షల మందిని ప్రభావితం చేసే వ్యక్తి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యకు పాల్పడటం అత్యంత దారుణం. ఆత్మహత్యాయత్నం అనేది చట్టరీత్యా నేరం మాత్రమే కాదు.. లైవ్ స్ట్రీమింగ్లో ఇలాంటివి చూపడం ద్వారా యువతకు తప్పుడు సందేశం పంపినట్లవుతుంది. భావోద్వేగాలను నియంత్రించుకోలేక నడిరోడ్డుపై కారుతో విన్యాసాలు చేయడం వల్ల తన ప్రాణంతో పాటు అటుగా వెళ్లే అమాయక ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లింది.
ప్రస్తుతం అనురాగ్ డోభాల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా కానీ.. పోలీసులు ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. పబ్లిక్ రోడ్డుపై అతివేగంగా కారు నడపడం.. ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి కారణం కావడం వంటి అంశాలపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం లేదా సానుభూతి కోసం ఇలాంటి పనులు చేయడం మానుకోవాలని.. బాధ్యతగల పౌరుడిగా ప్రవర్తించాలని అందరూ హితవు పలుకుతున్నారు.
