ఆ స్టార్ హీరో కోసం తమన్-అనిరుద్
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్- టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 25 May 2026 11:54 AM ISTబాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్- టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాత్కాలికంగా SVC63 ప్రాజెక్ట్ గా హైలైట్ అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ విషయంలో దిల్ రాజు ఎంతమాత్రం రాజీ పడకుండా బాలీవుడ్ నిర్మాణ సంస్థలకు ధీటుగా నిర్మించాలని ముందుకెళ్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వస్తోంది. ఈ చిత్రానికి ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేయబోతున్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులను రంగంలోకి దించేందుకు చిత్రబృందం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
టాలీవుడ్, కోలీవుడ్లలో టాప్ చార్ట్బస్టర్ సాంగ్స్తో ఊపేస్తున్న అనిరుధ్ రవిచందర్ - ఎస్.ఎస్. థమన్లు ఈ ప్రాజెక్ట్లో భాగం కానున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకే సినిమాలో ఇద్దరు స్టార్ కంపోజర్స్ కలిసి పనిచేస్తుండటం మ్యూజిక్ లవర్స్లో సరికొత్త జోష్ నింపుతోంది. ఇద్దరు సంగీత దర్శకుల బాధ్యతల విషయానికి వస్తే.. చిత్రంలో పాటల కంపోజిషన్ను ఎస్.ఎస్. థమన్ హ్యాండిల్ చేస్తుండగా, సినిమాకు ఎంతో కీలకమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను అనిరుధ్ రవిచందర్కు అప్పగించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
సాధారణంగా భారీ యాక్షన్ చిత్రాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతటి ప్రాధాన్యత కలిగి ఉంటుందో? ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనిరుధ్ రీ-రికార్డింగ్, థమన్ మాస్ బీట్స్ తోడైతే సినిమా మ్యూజికల్ పరంగా సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అయితే దీనిపై మేకర్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తోంది. గతంలో `జవాన్` చిత్రంతో బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన నయనతార ఇప్పుడు సల్మాన్తో జతకట్టడం విశేషం. గత ఏప్రిల్ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ముంబైలో ఘనంగా జరిగాయి.
అత్యంత వైభవంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్లో బాలీవుడ్ నటుడు రాజ్పాల్ యాదవ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ చిత్రాలు పండుగ సీజన్లలో? ముఖ్యంగా ఈద్ కానుకగా విడుదల కావడం ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. అదే సెంటిమెంట్ను ఫాలో అవుతూ నిర్మాతలు ఈ సినిమాను 2027 ఈద్ పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దేశభక్తి నేపథ్య యుద్ధ చిత్రం `మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్` షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన వెంటనే వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది. హాలీవుడ్ - బాలీవుడ్ మేళవింపుతో, అటు నార్త్ ఇటు సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా భారీ కాస్టింగ్తో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఒకవైపు వంశీ పైడిపల్లి మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్, మరోవైపు సల్మాన్ ఖాన్ మాస్ ఇమేజ్ తోడు నయనతార గ్లామర్, అనిరుధ్-థమన్ల మ్యూజికల్ పవర్ అన్నీ కలిపి ప్రాజెక్ట్ను భారతీయ సినిమా చరిత్రలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రంగా నిలబెడుతున్నాయి.
