ఐకాన్ స్టార్- బాలీవుడ్ ప్రాజెక్ట్ వెనక ఏం జరుగుతోంది?
స్టెప్ బై స్టెప్ కొత్త హైట్స్కి చేరుకోవాలని, ఊహించిన స్థాయిలో సినిమాలు చేయాలని చాలా మంది స్టార్లు ఇప్పుడు ఆలోచిస్తున్నారు.
By: Tupaki Desk | 10 Feb 2026 11:02 AM ISTస్టెప్ బై స్టెప్ కొత్త హైట్స్కి చేరుకోవాలని, ఊహించిన స్థాయిలో సినిమాలు చేయాలని చాలా మంది స్టార్లు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. మారిన సమీకరణాలు, పెరిగిన సినిమా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని సరికొత్త నేపథ్యాలతో హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని సినిమాలు ట్రై చేస్తున్నారు. ఈ విషయంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందికంటే ముందుంటున్న విషయం తెలిసిందే. `పుష్ప`, `పుష్ప 2` సినిమాలతో పాన్ ఇండియా వైడ్గా సంచలనం సృష్టించిన బన్నీ ఈ మూవీ తరువాత అంతకు మించి అనే స్థాయిలో అడుగులు వేస్తున్నాడు.
ఇందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో ఓ భారీ పాన్ వరల్డ్ స్థాయి మూవీకి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కోలీవుడ్లో భారీ ప్రాజెక్ట్లకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే మెయిన్ హీరోయిన్గా నటిస్తుండగా కీలకమైన క్యారెక్టర్లో మరో హీరోయిన్గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న కనిపించబోతోంది. ఇప్పటికే సెట్లోకి అడుగుపెట్టిన రష్మిక కీలక ఘట్టాల్లో పాల్గొంటోందని తెలిసింది.
మరో రెండు కీలక పాత్రల్లో జాన్వీకపూర్, మృణాల్ ఠాకూర్ నటిస్తారని వార్తలు షికారు చేస్తున్నా దీనిపై టీమ్ ఇంత వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఈ మూవీ తరువాత బన్నీ తమిళ డైరెక్టర్ లోకేష్ కగరాజ్ డైరెక్షన్లో ఓ క్రేజీ యాక్షన్ డ్రామాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కావడం తెలిసిందే. అయితే వీటికి భిన్నంగా బన్నీ మరో క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. `పుష్ప 2` బ్లాక్ బస్టర్ హిట్ తరువాత బాలీవుడ్ వెళ్లిన బన్నీ అక్కడ క్రేజీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీని ప్రత్యేకంగా కలవడం తెలిసిందే.
భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో ఒక్క మూవీ అయినా చేయాలని హీరోల్లో చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కోరికే బన్నీకి కూడా ఉందట. ఆ కారణంగానే ఆ డైరెక్టర్ని కలిసిన బన్నీ ఆయనతో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని, ఇక ఉండదని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఎలాంటి నిజం లేదని తాజాగా తేలింది.
బన్నీ, సంజయ్ లీలా భన్సాలీల కాంబినేషన్లో సినిమా అంటే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తారని, అయితే దానికి తగ్గ స్టోరీ కుదిరాకే చేయాలని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ అన్వేషణలో ఉన్న సంజయ్ లీలా భన్సాలీ స్టోరీ సెట్ కాగానే షూటింగ్ ప్రారంభించి బ్యాక్ టు బ్యాక్ రెండు షెడ్యూల్స్ని రాకెట్ స్పీడుతో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడని బాలీవుడ్ వర్గాల కథనం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని ఇన్ సైడ్ టాక్.
