అట్లీ+అల్లు.. ఆల్ టైమ్ బడ్జెట్ బ్రేకింగ్ ప్రాజెక్ట్
అల్లు అర్జున్ “పుష్ప 2” తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో, ఫ్యాన్స్ మాత్రమే కాక, ఇండస్ట్రీలోని పెద్ద వాళ్లంతా దీన్ని ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్గా చూస్తున్నారు.
By: Tupaki Desk | 9 April 2025 5:30 PMస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఇండస్ట్రీ మొత్తం తనవైపు చూసేలా కొత్త ప్రాజెక్ట్ ను లైన్ లోకి తెచ్చిన విషయం తెలిసిందే. మాస్ డైరెక్టర్ అట్లీ తో కలసి బన్నీ చేస్తున్న కొత్త సినిమా అధికారికంగా ప్రకటించారు. ఈ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎంత మంది వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. అట్లీ గతంలో విజయ్తో చేసిన సినిమాలు, షారుక్ ఖాన్తో చేసిన ‘జవాన్’ బ్లాక్బస్టర్ కావడంతో ఆయనపై భారీ నమ్మకం ఉంది. అలాంటి డైరెక్టర్తో బన్నీ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ పట్ల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్కి సంబంధించి విడుదల చేసిన వీడియోలోని విజువల్స్ అందరినీ ఆశ్చర్యపరిచాయి. సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ కావడం తో పాటు, దానిలో సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉండబోతున్నాయనేది క్లారిటీకి వచ్చింది. అల్లు అర్జున్ “పుష్ప 2” తర్వాత చేస్తున్న సినిమా ఇది కావడంతో, ఫ్యాన్స్ మాత్రమే కాక, ఇండస్ట్రీలోని పెద్ద వాళ్లంతా దీన్ని ఒక చారిత్రాత్మక ప్రాజెక్ట్గా చూస్తున్నారు.
ఇక అసలైన హైలైట్ విషయం ఏమిటంటే.. ఈ సినిమాకు భారీగా వీఎఫ్ఎక్స్ (VFX) బడ్జెట్ కేటాయించారట. అందుతున్న సమాచారం ప్రకారం, కేవలం VFX కోసమే రూ. 250 కోట్లు ఖర్చు చేయబోతున్నారట. ఇది దక్షిణాది సినిమాల్లో ఇప్పటివరకు ఎవరూ ఖర్చు పెట్టని రేంజ్ అని చెప్పొచ్చు. అమెరికాలోని ప్రముఖ హాలీవుడ్ స్టూడియోలు ఈ ప్రాజెక్ట్లో భాగమవ్వనున్నాయి.
వీఎఫ్ఎక్స్ ప్రిపరేషన్ కోసం బన్నీ, అట్లీ లాస్ ఏంజిల్స్ వెళ్ళిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఇది “పుష్ప 2” కంటే ఎక్కువ బడ్జెట్తో రూపొందే సినిమా కానుందని సమాచారం. మొత్తం సినిమా బడ్జెట్ దాదాపు రూ.800 కోట్లకు చేరుకుంటుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ స్థాయి బడ్జెట్ అంటే సాధారణంగా రాజమౌళి సినిమాల దగ్గరే మనం చూసాం. ఇప్పుడు అట్లీ కూడా అలాంటి ప్రయత్నం చేయడం ఆసక్తికరమైన విషయం.
సినిమాలోని సాంకేతికత, విజువల్స్, గ్రాఫిక్స్ అన్నీ కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సినిమా 2026లో విడుదల కానుంది. అప్పటివరకు ఒక్కో విడత అప్డేట్స్తో ఫ్యాన్స్కి ట్రీట్ దక్కనుంది. ఇప్పటి వరకు కథానాయిక ఎవరో అధికారికంగా ప్రకటించలేదు. సమంత, రష్మిక, నయనతార పేర్లు వినిపిస్తున్నా ఇంకా ఏదీ ఫిక్స్ కాలేదు. అయితే ఇద్దరు హీరోయిన్లు ఉన్నట్టు టాక్ రావడంతో, బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ని తీసుకునే యోచనలో ఉన్నారని సమాచారం.
ఇక సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో బన్నీ తన క్రేజ్ను పాన్ వరల్డ్ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బన్నీ.. ఇప్పుడు అట్లీతో కలిసి ఆ స్థాయిని మించాలనుకుంటున్నాడు. మరి ఇది బన్నీ కెరీర్లో మరో ఎపిక్ ప్రాజెక్ట్గా నిలుస్తుందా అనేది చూడాలి.