చందు మొండేటి నా బలం.. గద్దర్ అవార్డుల్లో నాగచైతన్య ఎమోషనల్
ఇదే వేదికపై `తండేల్` చిత్ర దర్శకుడు చందు మొండేటిని `తన ప్రధాన బలం` అని నాగచైతన్య అభివర్ణించారు.
By: Sivaji Kontham | 20 March 2026 10:35 AM ISTతెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన `గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025-26` వేదికపై అక్కినేని నాగచైతన్య తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. తండేల్ చిత్రంలో తన నటనకు గాను `ఉత్తమ నటుడు`) పురస్కారాన్ని అందుకున్న చైతూ ఈ గౌరవం తన 16 ఏళ్ల సినీ ప్రయాణంలో అత్యంత ప్రత్యేకమైనదిగా పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని దక్కించుకున్నందుకు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు.
తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తాను నటించిన ప్రతి సినిమా వెనుక వంద శాతం శ్రమ దాగి ఉంటుందని చైతన్య వివరించారు. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాయని.. మరికొన్ని ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే `తండేల్` సినిమాలోని రాజు క్యారెక్టర్ కోసం కేవలం కష్టపడటమే కాకుండా.. తన మనసు పెట్టి పనిచేశానని.. అందుకే ఈ గుర్తింపు వచ్చిందని చైతన్య ఆనందం వ్యక్తం చేశారు.
ఈ అవార్డు తనకు ఒక నటుడిగా మరింత బాధ్యతను పెంచిందని నాగచైతన్య అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలని.. ఒక కళాకారుడిగా ఎదుగుతూ మరిన్ని వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందించాలని తనకు ఈ పురస్కారం గొప్ప మోటివేషన్ను ఇచ్చిందని ఆయన అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన విజనరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఇదే వేదికపై `తండేల్` చిత్ర దర్శకుడు చందు మొండేటిని `తన ప్రధాన బలం` అని నాగచైతన్య అభివర్ణించారు. బన్నీ వాస్, దేవిశ్రీ ప్రసాద్, సాయి పల్లవి.. ఇతర సాంకేతిక నిపుణుల సమిష్టి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు. తన కుటుంబ సభ్యులు, శోభిత, అభిమానులు తన వెన్నంటే నిలిచి ధైర్యాన్ని ఇస్తున్నారని చెబుతూ.. `ఇంకా రాజులమ్మ జాతరే` అంటూ తండేల్ డైలాగ్ తో ప్రసంగాన్ని ముగించారు.
ప్రజా గాయకుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ప్రారంభించడంపై నాగచైతన్య హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు.. కమిటీ సభ్యులకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఒక సామాజిక యోధుడి పేరుతో అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. నాగచైతన్య ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. విరూపాక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో `వృషకర్మ` అనే మైథాలజీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కెతోను చై ఓ ప్రాజెక్టుకు కమిటయ్యారు.
