పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన అజిత్
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పాలిటిక్స్ లోకిరావడంపై తాజాగా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 3 May 2025 11:30 PMతమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ పాలిటిక్స్ లోకిరావడంపై తాజాగా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చి 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ అందరూ తాను రాజకీయాల్లోకి వస్తాననుకుంటున్నారని, కానీ తనకు ఆ ఉద్దేశం లేదని స్పష్టతనిచ్చారు.
తనకు వ్యక్తిగతంగా రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని, రాజకీయాల పట్ల తనకు ఆసక్తి లేదని ఆయన తెలిపారు. రాజకీయాల్లోకి వచ్చి మార్పు తీసుకు రాగలమనే నమ్మకంతో అడుగులేస్తున్న వారంతా సక్సెస్ అవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. రీసెంట్ గా కొత్త పొలిటికల్ పార్టీని పెట్టి, పాలిటిక్స్ లోకి వెళ్లిన తన ఫ్రెండ్, దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఎంతో సాహసవంతమైందని అజిత్ పేర్కొన్నారు.
140 కోట్ల దేశ జనాభా కలిగిన ఇండియాలో ఎన్నో రకాల మతాలు, జాతుల ప్రజలు ఎంతో సామరస్యంగా జీవించడం గొప్ప విషయమని, అలాంటి దేశాన్ని ఒకే తాటిపై నడిపించడం కేవలం పొలిటీషియన్ల వల్లే అవుతుందని అజిత్ అభిప్రాయపడ్డారు. రీసెంట్ గా తనకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును సత్కరించగా, ఆ అవార్డు అందుకోవడానికి రాష్ట్రపతి భవన్ ను సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అక్కడి ఏర్పాట్లు తనను ఎంతో ఆశ్చర్యపరిచాయని అజిత్ వెల్లడించారు.
దేశంలోని పొలిటీషియన్లు తమ జీవితాలను ఎలా గడుపుతారనేది తనకు అప్పుడే తెలిసి వచ్చిందని, ఒక ప్రాంతాన్ని, రాష్ట్రాన్ని, లేదా దేశాన్ని బాధ్యతగా నడిపించడం ఎంతో కష్టమైన పని అని తనకు అప్పుడే అర్థమైందని, అందుకే విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం చాలా డేర్ స్టెప్ అని అంటున్నానని అజత్ తెలిపారు.