ఆదిత్య 369 రీ రిలీజ్ : హీరోయిన్ అప్పుడు.. ఇప్పుడు..!
ఈ సమయంలోనే సినిమాలో హీరోయిన్గా నటించిన మోహిని అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్ గురించి చర్చ జరుగుతోంది.
By: Tupaki Desk | 2 April 2025 8:44 AMనందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'ఆదిత్య 369'. 1991 జులై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్షేషన్ క్రియేట్ చేసింది. హాలీవుడ్ కే పరిమితం అయిన సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్ను సింగీతం వారు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. అంతే కాకుండా ఎవరి ఊహకు సైతం అందని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ను చాలా సింపుల్గా ప్రేక్షకులకు అర్థం అయ్యేలా సింగీతం రూపొందించారు. అద్భుతమైన కథ, కథనం, సంగీతం, కాస్టింగ్ కారణంగా ఆదిత్య 369 సినిమా క్లాసిక్గా నిలిచింది అనడంలో సందేహం లేదు. అద్భుతమైన కాన్సెప్ట్తో రూపొందిన ఈ సినిమాకు భారీ లాభాలు దక్కాయి.
సినిమా విడుదల అయ్యి మూడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ టీవీలో చూసేందుకు, ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రేక్షకులు సైతం ఆదిత్య 369 సినిమాను పదుల సార్లు చూసి ఉంటారు. టాలీవుడ్లో గొప్ప సినిమాల జాబితా తీస్తే అందులో కచ్చితంగా ఈ సినిమా ఉండాల్సిందే. అలాంటి సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అంటూ ఫ్యాన్స్తో పాటు ఇలాంటి సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రీ రిలీజ్ కి సిద్ధం అయింది. ఇటీవలే బాలకృష్ణ రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొని అప్పటి జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
ఈ సమయంలోనే సినిమాలో హీరోయిన్గా నటించిన మోహిని అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్ గురించి చర్చ జరుగుతోంది. అప్పట్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మోహిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. తమిళనాడుకు చెందిన ఈమె 1987లో తమిళ్ సినిమాలతో ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అయితే 1991లో బాలకృష్ణతో కలిసి నటించిన ఈ సినిమాతో సూపర్ హిట్ను సొంతం చేసుకుని సౌత్ ఇండియాలోనే స్టార్ హీరోయిన్గా నిలిచింది. తమిళ్, కన్నడం, మలయాళం, తెలుగు సినిమాలతో పాటు ఒక హిందీ సినిమాలోనూ నటించింది. అన్ని సౌత్ ఇండియన్ భాషల్లో కలిపి దాదాపు 100 సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.
2011లో ఈమె చివరి సారి వెండి తెరపై కనిపించింది. అప్పటి నుంచి సినిమాలకు పూర్తి దూరంగా ఉంటూ వచ్చింది. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మోహిన అమెరికాలో సెటిల్ అయ్యారు. సినిమాల్లో నటించిన సమయంలో సన్నగా నాజూకుగా కనిపించిన మోహిని ఆ తర్వాత కాస్త బరువు పెరిగారు. అయితే ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని, అప్పుడు ఎలా అందంగా ఉండేవారో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అమెరికాలో మత ప్రచారకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీతో ఈమె ఉన్న ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ఆదిత్య 369 రీ రిలీజ్ సందర్భంగా ఈమె గురించి మరోసారి చర్చ జరుగుతోంది.