Begin typing your search above and press return to search.

మణికర్ణిక మళ్లీ లేవడం సాధ్యమేనా?

హీరోయిన్ గా కంగనా రనౌత్‌ ఒకప్పుడు సాధించిన విజయాలతో పోల్చితే ఇప్పుడు చేస్తున్న సినిమాలపై ఆమె అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు

By:  Tupaki Desk   |   27 Oct 2023 11:30 AM GMT
మణికర్ణిక మళ్లీ లేవడం సాధ్యమేనా?
X

కంగనా రనౌత్‌... ఈమె బాలీవుడ్‌ లో మోస్ట్‌ పాపులర్ హీరోయిన్ అయినా కూడా ఈమె చేసే వివాదాస్పద వ్యాఖ్యలు ఇతర కారణాల వల్ల పాన్ ఇండియా గుర్తింపు కలిగి ఉంది అనడంలో సందేహం లేదు. చాలా ఏళ్ల క్రితం తెలుగు లో ఏక్‌ నిరంజన్ అనే సినిమా ను చేసింది. సాధారణంగా అయితే తెలుగు ప్రేక్షకులు కంగనా ను మర్చిపోవాలి. కానీ ఆమె ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉండటం వల్ల ఆమె గురించి తెలుగు వారిలో కూడా చర్చ జరుగుతూనే ఉంటుంది.

కంగనా ను ఫైర్ బ్రాండ్‌ అంటూ మీడియా వారు పిలుస్తూ ఉంటారు. ఆమె మాటలు చాలా ఘాటుగా ఉంటాయి. అవతలి వారు ఎంతటి వారు అయినా కూడా తాను అనుకున్నది అనుకున్నట్లుగా మాట్లాడేస్తుంది. అందుకే ఆమెకి చాలా మందితో గొడవలు ఉన్నాయి. ఎన్ని గొడవలు ఉన్నా కూడా సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది.

హీరోయిన్ గా కంగనా రనౌత్‌ ఒకప్పుడు సాధించిన విజయాలతో పోల్చితే ఇప్పుడు చేస్తున్న సినిమాలపై ఆమె అభిమానులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2019 లో విడుదల అయిన మణికర్ణిక కాస్త పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. ఆ సినిమా తర్వాత చాలా సినిమాలతో కంగనా వచ్చింది. కానీ ఈ నాలుగేళ్లలో కనీసం ఒక్క హిట్ ను కూడా సాధించలేక పోయింది.

కంగనా సినిమాలు హిట్ ఏమో కానీ ఒకదానికి మించి మరోటి అన్నట్లుగా డిజాస్టర్స్ లో సరికొత్త రికార్డు ను నమోదు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో హిందీ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా మొదటి రోజు మినిమంగా పది కోట్ల నుంచి యాబై కోట్లు అంతకు మించి వసూళ్లు సాధిస్తున్న విషయం తెల్సిందే. కానీ కంగనా తాజా చిత్రం తేజస్ దారుణమైన రికార్డును నమోదు చేసింది.

బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తేజస్ సినిమా మొదటి రోజు కేవలం కోటిన్నర రూపాయలను మాత్రమే రాబట్టింది. ఒకప్పుడు మొదటి రోజే పదుల కోట్ల వసూళ్లు సాధించిన కంగనా ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మణికర్ణిక మళ్లీ పుంజుకుని వందల కోట్ల సినిమాలు చేసేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.