ఆయన వల్లే గుడ్ బాయ్ గా మారా
తమిళ హీరోల్లో శింబుపై ఉన్నన్ని విమర్శలు, ఆరోపణలు మరో హీరోపై లేవంటే అతిశయోక్తి లేదు. పలు విషయాల్లో ఎన్నో వివాదాల్లో వార్తల్లోకెక్కాడు శింబు.
By: Tupaki Desk | 4 May 2025 3:50 AMతమిళ హీరోల్లో శింబుపై ఉన్నన్ని విమర్శలు, ఆరోపణలు మరో హీరోపై లేవంటే అతిశయోక్తి లేదు. పలు విషయాల్లో ఎన్నో వివాదాల్లో వార్తల్లోకెక్కాడు శింబు. దర్శకనిర్మాతలతో గొడవలు పెట్టుకోవడం, తన తోటి హీరోయిన్లతో ఎఫైర్లు వల్ల శింబు పేరు ఎన్నో సార్లు వార్తల్లో మార్మోగింది. అంతేకాదు శింబు షూటింగ్స్ కు కూడా సరిగ్గా రాడని, నిర్మాతలను నానా ఇబ్బంది పెడతాడని అతనిపై ఎన్నో విమర్శలున్నాయి.
ఒకానొక టైమ్ లో అతనిపై చిత్ర పరిశ్రమ నిషేధం విధించాలని తమిళ నిర్మాతల మండలికి ఎన్నో కంప్లైంట్స్ కూడా శింబు గురించి వెళ్లాయి. అలాంటి శింబును కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఒక్కసారిగా మార్చేశాడట. ఆల్రెడీ వీరిద్దరూ కలిసి గతంలో నవాబ్ అనే సినిమా కోసం వర్క్ చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరోసారి వీరిద్దరూ థగ్ లైఫ్ కోసం కలిసి వర్క్ చేస్తున్నారు. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న థగ్ లైఫ్ సినిమాలో శింబు నటిస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో ఓ జర్నలిస్ట్ శింబుని, మణిరత్నం సినిమాకు గుడ్ బాయ్ గా ఎలా మారిపోయారని ప్రశ్నించగా, దానికి శింబు సమాధానమిచ్చాడు.
సినిమా షూటింగ్ ప్లాన్ ప్రకారం జరగడమనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందని, డైరెక్టర్ క్రమశిక్షణతో ఉంటూ, టైమ్ కు షూటింగ్ కు వస్తే అందరూ ఆయన్ని ఫాలో అవుతారని, డైరెక్టర్ బాధ్యతగా లేకపోతే అది టీమ్ లోని అందరిపై ఎఫెక్ట్ చూపిస్తుందని శింబు చెప్పాడు. మణి సర్ అంత పెద్ద డైరెక్టర్ అయినప్పటికీ అందరి కంటే ముందు షూటింగ్ కు వస్తాడని అది చూసి తాను కూడా క్రమశిక్షణతో మెలిగానని శింబు తెలిపాడు.
మణి సర్ ఒక్క రోజు కూడా షూట్ కు లేట్ గా రాలేదని, చాలా మంది డైరెక్టర్లల్లా ఆయన సెట్స్ కు వచ్చాక సీన్ గురించి ఆలోచించరని, ఏదైనా మార్పులు చేయాలన్నా దూరం నుంచి చెప్పకుండా ఎంత దూరంలో ఉన్నా ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చి ఆయనే వివరించి చెప్తారని, ఆయనెంతో సింపుల్ గా ఉంటారని, ఆయన లాంటి డైరెక్టర్లు తన కెరీర్లో ఉండి ఉంటే మరిన్ని సినిమాలు చేసేవాడినని శింబు చెప్పాడు.