Begin typing your search above and press return to search.

ఐటీ ఉద్యోగి రూం షేరింగ్ 'అతి'.. అడ్డంగా బుక్ చేసిన మహిళ

ఐటీ కంపెనీలో పని చేసే కిరణ్ కుమార్ అనే యువకుడు వెంగళ్ రావు నగర్ లో ఉండేవాడు. ఏడాది క్రితం ఒక రూంను అద్దెకు తీసుకొని ఉండేవాడు

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:02 AM GMT
ఐటీ ఉద్యోగి రూం షేరింగ్ అతి.. అడ్డంగా బుక్ చేసిన మహిళ
X

సైబర్ మోసాల్లో అత్యధికం అత్యాశతోనే ముడి పడి ఉంటాయి. ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోరు. మోసపోయిన వారి ఉదంతాన్ని లోతుగా చూస్తే.. ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. నలుగురు నడిచే దారిలో కాకుండా అందుకు భిన్నంగా వ్యవహరించే వారిని టార్గెట్ చేసి మోసం చేయటంలో సైబర్ నేరగాళ్లు ముందుంటారు. తాజా ఉదంతం కూడా ఈ కోవలోకే చెందుతుందని చెప్పాలి. ఒక ఐటీ ఉద్యోగి అత్యాశ.. అత్యుత్సాహం అడ్డంగా బుక్ చేయటంతో పాటు.. అవమానాలకు.. అనవసర కేసులకు కారణమైంది. అదెలానంటే..

ఐటీ కంపెనీలో పని చేసే కిరణ్ కుమార్ అనే యువకుడు వెంగళ్ రావు నగర్ లో ఉండేవాడు. ఏడాది క్రితం ఒక రూంను అద్దెకు తీసుకొని ఉండేవాడు. తనతో రూంను షేర్ చేసుకోవటానికి ఆసక్తి ఉండే వారు తనను సంప్రదించాలంటూ ఆన్ లైన్ మాధ్యమంలో ఒక ప్రకటన ఇచ్చాడు. ఒక మహిళ ఆసక్తి చూపి.. అతడి గదిలో చేరింది. వారిద్దరు తర్వాత కూకట్ పల్లికి షిఫ్టు అయ్యారు. సహజీవనం పేరుతో ఇద్దరు కలిసి ఉండేవారు.

అయితే.. కాలక్రమంలో ఆమె తీరుపై సందేహాలు రావటం.. అనుమానం వచ్చి అడిగితే తాను వేశ్యనని ఆమె చెప్పటంతో రూంను ఖాళీ చేయాలని కోరాడు. అందుకు ఆమె ససేమిరా అనటమే కాదు.. వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరింపులకు దిగింది. అంతేకాదు.. తనపై లైంగిక దాడి చేశాడంటూ కంప్లైంట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఆమె షీ టీంను సంప్రదించింది.

దీంతో.. వారిద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత.. కిరణ్ నుంచి ఆమెకు రూ.4.7 లక్షల పరిహారంగా తీసుకుంది. ఆ తర్వాత కూడా కిరణ్ తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో.. కిరణ్ కుమార్ సైబర్ పోలీసుల్ని ఆశ్రయించి.. విషయం మొత్తం చెప్పటంతో సోషల్ మీడియాలో ఉన్న వారి ఫోటోల్ని తొలగించారు. ఈ క్రమంలో ఈ నెల 13న ఇద్దరు వ్యక్తులతో దాడి చేయించింది. దీంతో.. బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఆమెపై కేసు నమోదు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే.. రూం షేరింగ్ ప్రకటన.. కిరణ్ అత్యాశ ఇన్ని సమస్యలకు కారణమైందని చెప్పకతప్పుదు. ఆన్ లైన్ పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. లేదంటే.. మొదటికే మోసం రావటం ఖాయం.