కర్కస తల్లి బిడ్డల్ని కొడవలికి బలి చేసింది
హైదరాబాద్ మహానగరంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా.. విషయం తెలిసిన తర్వాత మనసంతా చేదుగా మారే ఈ దుర్మార్గపు ఘటన అమ్మతనానికి మాయని మచ్చలా మార్చింది.
By: Tupaki Desk | 18 April 2025 4:41 AMహైదరాబాద్ మహానగరంలో ఘోర ఘటన చోటు చేసుకుంది. విన్నంతనే ఉలిక్కిపడేలా.. విషయం తెలిసిన తర్వాత మనసంతా చేదుగా మారే ఈ దుర్మార్గపు ఘటన అమ్మతనానికి మాయని మచ్చలా మార్చింది. కన్నబిడ్డల మీద కసాయితనంతోకొడవలి వేట్లు వేసి.. ప్రాణాలు పోసిన చేతులతోనే ప్రాణాలు తీసింది. కోపం కొద్దీ పిల్లల్నిదండించినా.. తిట్టినా ఆ రోజంతా అమ్మ మనసు ఆందోళన చెందుతుంది. అయ్యో.. అనవసరంగా తిట్టానే.. కొట్టానే అని తల్లడిల్లిపోతుంది. అలాంటి అమ్మ.. పదేళ్ల లోపు ఇద్దరు పిల్లల్ని వేట కొడవలితో దారుణంగా నరికిన దారుణ ఉదంతం హైదరాబాద్ లోని గాజులరామారంలో చోటు చేసుకుంది.
పోలీసుల వెల్లడించిన వివరాల ప్రకారం పెద్ద కొడుక్కి ఆరోగ్య సమస్యలు ఉండటం.. చిన్న కొడుకు ఆరోగ్యం దెబ్బ తినటం.. భార్యభర్తల మధ్య నిత్యం డొడవలు.. అన్నింటికి మించి తీవ్ర మానసిక సమస్యలతోనే ఈ కర్కస తల్లి ఇంతటి దారుణానికి తెగబడింది. పిల్లల్నిచంపి తాను చావాలని ముందే అనుకుందేమో.. పిల్లలపై దాడి చేసి చేసి.. వారునెత్తుటి మడుగులో కొట్టుకుంటుండానే.. ఆమె తాను ఉండే అపార్టమెంట్ మీద నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఆరు పేజీలకు పైనే ఉన్న సూసైడ్ నోట్ లో పేర్కొన్న అంశాల్ని పోలీసులు వెల్లడించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన వెంకటేశ్వర్రెడ్డి.. తేజస్వినీ రెడ్డిలు భార్యభర్తలు. వీరికి ఆశిష్ రెడ్డి (8).. హర్షిత్ రెడ్డి (6) సంతానం. మొదటి భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత తేజస్విని రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల క్రితం వీరు హైదరాబాద్ కు వచ్చారు. గాజులరామారంలో ఒక అపార్ట్ మెంట్ లో ఉంటున్నారు. వెంకటేశ్వరరావు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. భార్య ఇంటి వద్దే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటుంది.
కొద్ది రోజులుగా తేజస్విని కంటి సమస్యతో బాధ పడుతోంది. పెద్ద కొడుకు ఆశిష్ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నాడు. ఏం తిన్నా వాంతులు చేసుకుంటున్నాడు. దీంతో ఒకప్రైవేటు ఆసుపత్రిలో కొడుక్కి చికిత్స చేయిస్తోంది. తనతోపాటు పిల్లలు కూడా తరచూ అనారోగ్యానికి గురి కావటంతో ఆమె డిప్రెషన్ బారిన పడింది. దీనికి తోడు ఆమె మానసిక పరిస్థితిలో మార్పు వచ్చింది. ఉన్మాదిలా మారింది. గురువారం సాయంత్రం ఆరు పేజీల లేఖ రాసిన తేజస్విని.. ఇంట్లో ఆడుకుంటున్న ఇద్దరి పిల్లల్ని పట్టుకొని.. అప్పటికే బయట నుంచి తెచ్చిన వేట కొడవలితో విచక్షణరహితంగా దాడి చేసింది.
ఇద్దరుపిల్లలు గాయాలతో భయపడుతూ వంటింట్లోకి.. పడక గదిలోకి పరుగులు తీసినా వెంబడించి మరీ వారిపై వేట్లు వేసింది. ఈ దాడిలో ఆశిష్ అక్కడికక్కడే మరణించగా.. తీవ్రగాయాలై.. కొన ఊపిరితోకొట్టుమిట్టాడుతున్న హర్షిత్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా.. దారి మధ్యలోనే చనిపోయాడు. ఈ లోపు తేజస్విని అపార్ట్ మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. తాను.. పిల్లలు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా.. భర్త పట్టించుకోవటం లేదని.. అందుకేతాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.