Begin typing your search above and press return to search.

సైబర్ మాఫియా దుర్మార్గాల్ని కళ్లకు కట్టినట్లు చెప్పిన హైదరాబాదీ!

సైబర్ మాఫియా ఎంత దారుణంగా.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్న విషయానికి సంబంధించిన వైనం వెలుగు చూడటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2025 5:30 AM
How a Kashmiri Agent Tricked a Hyderabad Youth
X

సైబర్ మాఫియా ఎంత దారుణంగా.. దుర్మార్గంగా వ్యవహరిస్తుందన్న విషయానికి సంబంధించిన వైనం వెలుగు చూడటం తెలిసిందే. టెలీకాలర్ ఉద్యోగం కోసమని వెళ్లి.. సైబర్ మాఫియా చేతిలో పడి.. కిందా మీదా పడి వారి చెర నుంచి తప్పించుకు వచ్చిన హైదరాబాదీ రహ్మత్ ఖాన్. హైదరాబాద్ లోని మాదన్నపేటకు చెందిన ఇతను విదేశాల్లో టెలీకాలర్ ఉద్యోమన్న మాయమాటల్ని నమ్మి మోసం పోవటం తెలిసిందే.

తాజాగా తెలంగాణ బ్యూరో సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు సైబర్ మాఫియా పని తీరు గురించి వివరించి విస్మయానికి గురయ్యేలా చేశారు. తన పేదరికాన్ని అసరాగా చేసుకున్న కశ్మీర్ కు చెందిన ట్రావెల్ ఏజెంట్ ఆఫిఖీబాబా.. లావోస్ లో టెలికాలర్ ఉద్యోగం ఉందని చెప్పి మోసగించాడని చెప్పారు. చివరకు తాను వెళ్లి సైబర్ మాఫియా చేతుల్లో పడినట్లు చెప్పారు. తనను మోసం చేసిన కశ్మీర్ ట్రావెల్ ఏజెంట్ మీద ఫిర్యాదు చేశారు.

పోలీసులకు రహ్మత్ ఖాన్ చెప్పిన విషయాల్ని అతని మాటల్లోనే చదివితే.. ‘‘లావోస్ లో టెలికాలర్ జాబ్ ఉందని చెబితే అందుకు అంగీకరించాను. ఇండియా నుంచి బ్యాంకాక్ తీసుకెళ్లారు. ఎయిర్ పోర్టులో బెల్ అనే ఇథోపియన్ నన్నురిసీవ్ చేసుకన్నాడు. పదకొండు గంటల బస్సు ప్రయాణం తర్వాత లావోస్ చేరుకున్నాం. అక్కడ నుంచి గోల్డెన్ ట్రయాంగిల్ కు వెళ్లాం. అక్కడ చైనా వారు నడిపే ఒక సైబర్ కంపెనీలో ఉద్యోగం పేరుతో కాంట్రాక్ట్ మీద సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత నా పాస్ పోర్టు.. ఫోన్ తీసుకున్నారు. సైబర్ మోసాల మీద పదిహేను రోజులు ట్రైనింగ్ ఇచ్చారు’’ అని చెప్పారు.

ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత అందమైన అమ్మాయిల ఫోటోలు సేకరించే పని తనకు అప్పగించారని.. ఆ తర్వాత ఎన్ఆర్ఐలను మోసగించాలని చెప్పారన్నారు. ‘అమెరికాలో స్థిరపడిన భారతీయులనే టార్గెట్ చేయాల్సి ఉంటుంది. గూగుల్.. ఫేస్ బుక్ .. ఇన్ స్టా నుంచి అందమైన యువతుల ఫోటోలు డౌన్ లోడ్ చేయాలి. ఆ ఫోటోల్ని ప్రొఫైల్ గా పెట్టుకొని ఫేస్ బుక్ లో నకిలీ ఖాతాలు తెరవాలి. ఫ్రెండ్ రిక్వెస్ట్ లు పంపాలి. వారితో ఆన్ లైన్ లో అమ్మాయిల్లా పరిచయం చేసుకొని.. సెక్స్ అంశాలపై చాటింగ్ చేస్తూ ముగ్గులోకి దించాలి. ఆ తర్వాత నమ్మకమైన మాటలు చెప్పి వారి చేత పెట్టుబడులు పెట్టించాలి. ఆ తర్వాత ట్యాక్స్ పేరుతో దోచుకోవాలి’ అని పేర్కొన్నాడు.

వారు చెప్పిన టార్గెట్ రీచ్ కాలేదని చిత్రహింసలకు గురి చేశారని.. మూడు నెలలు జీతం కూడా ఇవ్వలేదన్నాడు. చివరకు అక్కడి స్థానికుల సాయంతో తప్పించుకొని లావోస్ ఎంబసీకి.. ఆ తర్వాత భారత ఎంబసీకి చేరుకున్నట్లు చెప్పారు. ఎంబసీ అధికారులకు తనకు ఎమర్జెన్సీ పాస్ పోర్టు ఇచ్చి ఇండియాకు పంపారని చెప్పాడు. తనను మోసం చేసిన ఏజెంట్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.