మద్యం లో మత్తు మందు కలిపి అత్యాచారం.. తర్వాత 1 కోటి డిమాండ్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., బాధితురాలు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తిని నమ్మింది.
By: Tupaki Desk | 31 May 2025 1:00 AM ISTహైదరాబాద్, బంజారాహిల్స్లో దారుణం జరిగింది. 24 ఏళ్ల యువతిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి, ఆమెపై అత్యాచారం చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి, కోటి రూపాయలు డిమాండ్ చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., బాధితురాలు ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఒక వ్యక్తిని నమ్మింది. నిందితుడు తాను ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నానని చెప్పడంతో, అతని మాటలు నమ్మింది. 2023 ఫిబ్రవరిలో వీరిద్దరూ మొదటిసారి కాఫీ షాపులో కలుసుకున్నారు.
ఆగస్టు 15న నిందితుడు యువతిని తన ఇంటికి రాత్రి భోజనానికి ఆహ్వానించాడు. అతని ఆహ్వానం మేరకు వెళ్లిన యువతికి, నిందితుడు మద్యం లో మత్తు మందు కలిపి ఇచ్చాడు. మత్తులోకి వెళ్లిన తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అంతేకాకుండా ఈ దారుణాన్ని వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను చూపిస్తూ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. మొదట రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితుడు, ఆ తర్వాత తన డిమాండ్ను రూ. 1 కోటికి పెంచాడు. సామాజికంగా పరువు పోతుందేమోనన్న భయంతో పాటు, అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేని స్థితిలో ఉన్న బాధితురాలు చివరకు పోలీసులను ఆశ్రయించింది.
ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి గోప్యతకు భంగం కలగకుండా పోలీసులు ఈ వ్యవహారాన్ని రహస్యంగా విచారిస్తున్నారు.
