Begin typing your search above and press return to search.

గొలుసులతో కట్టేసి చిత్రహింసలు.. ఆస్తి కోసం భార్య దారుణం!

కలలో కూడా ఊహించని పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి.

By:  Tupaki Desk   |   4 May 2024 4:30 AM GMT
గొలుసులతో కట్టేసి చిత్రహింసలు.. ఆస్తి కోసం భార్య దారుణం!
X

కలలో కూడా ఊహించని పరిణామాలు ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్నాయి. బంధాలు.. అనుబంధాలపై సరికొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చోటు చేసుకుంటున్న ఉదంతాలు షాకింగ్ గా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ శివారులో వెలుగు చూసిన వైనం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఆస్తి కోసం భర్తను గొలుసులతో బంధించి.. చిత్రహింసలకు గురి చేస్తున్న భార్య ఉదంతం సంచలనంగా మారింది.

అసలేం జరిగిందంటే.. సెంట్రింగ్ మేస్తిగా వ్యవహరించే నరసింహ భార్య భారతమ్మ. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కుమార్తెలు. భార్యపేరు మీద ఉన్న స్థలంలో ఇంటిని కట్టుకున్నారు. ఇంటిని కట్టే వేళలో అప్పులు చేశారు. దీంతో.. ఆ అప్పుల్ని తీర్చేందుకు తన పేరు మీద ఉన్న 115 గజాల ఇంటి స్థలాన్ని అమ్మేసి అప్పులు తీరుస్తానని చెప్పటంతో భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఓవైపు అప్పులు.. మరోవైపు ఇంట్లో వారి పోరు భరించలేని భర్త ఏడాది క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అతడి ఆచూకీ లభించలేదు.

ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 30న యాదాద్రి జిల్లాలో భర్త ఉన్నట్లుగా తెలుసుకున్న భార్య.. ఇద్దరు కొడుకులతో కలిసి నరసింహను ఘట్ కేసర్ లోని ఇంటికి బలవంతంగా తీసుకొచ్చారు. గదిలో ఉంచి బయటకు పారిపోకుండా గొలుసులతో కట్టేశారు. తాళం వేశారు. భర్త పేరుతో ఉన్న ఇంటి స్థలాన్ని తన పేరు మీద రాయాలంటూ భర్తను వేధింపులకు గురి చేస్తున్నట్లుగా వెల్లడైంది. అతడ్ని వేధింపులకుగురి చేస్తున్న వైనాన్ని సీక్రెట్ గా వీడియో తీసిన స్థానికుడు ఒకడు పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు రంగంలోకి దిగారు.

ఇంటికి వెళ్లిన పోలీసులకు గొలుసులతో కట్టేసి.. బంధించిన నరసింహను గుర్తించారు. పోలీసుల్ని చూసినంతనే ఏడ్చేసిన అతడ్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. భార్య భారతమ్మ.. కొడుకులు ఇద్దరి పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. తనను మూడు రోజులుగా గొలుసులతో బంధించి చిత్రహింసలకు గురి చేశారని.. తనను రక్షించాలంటూ వేడుకున్నాడు. ఈ ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.