Begin typing your search above and press return to search.

ఇంట్లో గొడవలు.. క్వారీలో శవంగా మారిన సర్పంచ్ భార్య

అందుకు భిన్నంగా సర్పంచ్ సతీమణి గుంతలో శవంగా మారటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   21 Feb 2024 4:45 AM GMT
ఇంట్లో గొడవలు.. క్వారీలో శవంగా మారిన సర్పంచ్ భార్య
X

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సంచలన ఉదంతం చోటు చేసుకుంది. ఇంట్లో గొడవల నేపథ్యంలో క్వారీలో శవంగా తేలిన సర్పంచ్ భార్య ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. లవ్ మ్యారేజ్ చేసుకొని భార్య పిల్లలతో హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నట్లుగా చెబుతున్నప్పటికీ.. అందుకు భిన్నంగా సర్పంచ్ సతీమణి గుంతలో శవంగా మారటం ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో ఈ దారుణ హత్య చోటు చేసుకుంది.

పోలీసులకు అందుతున్న ప్రాథమిక సమాచారం ప్రకారం పుంగనూరు మండలం నల్లగుట్లపల్లెతండాకు చెందిన సర్పంచ్ శ్రీనివాసులు నాయక్.. ఆయన సతీమణి మాధవిలకు కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లైంది. వారికి ఇద్దరు కుమార్తెలు. అయితే.. కొంతకాలంగా భార్యభర్తల మధ్య పొసగటం లేదు. తరచూ గొడవలు చోటు చేసుకుంటున్నాయి. ఎనిమిదేళ్ల క్రితం వారి వివాహం జరిగింది. సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లోకి మరో మహిళ వచ్చింది.

ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవటంతో భార్య భర్తల మధ్య సంబంధాల్లో తేడా వచ్చింది. తరచూ గొడవ పడుతుండటం.. భార్య పిల్లల్ని వేధిస్తున్న వైనాలు చోటు చేసుకున్నాయి. పలుమార్లు బంధువులు.. గ్రామ పెద్దలు జోక్యం చేసుకున్నా ఫలితం కనిపించలేదు.

ఈ నేపథ్యంలో మాధవి పోలీస్ స్టేషన్ లో భర్తపై కంప్లైంట్ చేశారు. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి భార్యభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు. కట్ చేస్తే.. మంగళవారం ఉదయానికి మాధవి ఊరికి దగ్గర్లోని క్వారీ నీటి మడుగులో శవంగా కనిపించటం షాకింగ్ గా మారింది.

ఆమెను భర్తే హత్య చేసినట్లుగా బంధువులు ఆరోపిస్తున్నారు. ఆమె డెడ్ బాడీ వద్దకు భర్త వచ్చే వరకు పోస్టుమార్టం చేయొద్దని బంధువులు అడ్డుకున్నారు. అయితే.. వారికి న్యాయం చేస్తామని పోలీసులు సర్దుబాటు చేయటంతో బాధితులు శాంతించారు. అనుమానాస్పద మరణం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సర్పంచ్ ను వెతుకుతున్నారు. భార్య మరణించిన తర్వాత నుంచి సర్పంచ్ కనిపించకుండా పోవటం పలు అనుమానాలకు తావిస్తోంది.