ఇక 2 ’టాటాలు’.. విడిపోనున్న దిగ్గజ సంస్థ.. షేరు ధర జంప్
జంషెడ్ జీ టాటా నుంచి మొన్నటి రతన్ టాటా వరకు వ్యక్తిగతంగా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నారు
By: Tupaki Desk | 8 May 2025 5:52 PM ISTభారతీయులతో భౌతికంగా కంటే భావోద్వేగం పరంగా ముడిపడి ఉన్న సంస్థ టాటా. జంషెడ్ జీ టాటా నుంచి మొన్నటి రతన్ టాటా వరకు వ్యక్తిగతంగా భారతీయుల అభిమానాన్ని చూరగొన్నారు. టాటా అంటే మనకు ఓ సంస్థ కాదు.. ఓ నమ్మకం. ఇది శతాబ్దం పైగా కొనసాగుతున్న నమ్మకం. దీనికి నిదర్శనమే ఇటీవల రతన్ టాటా మరణం అనంతరం దేశం స్పందించిన తీరు.
ఇక శతాబ్దంపైగా చరిత్ర ఉన్న టాటా సంస్థ త్వరలో రెండుగా విడిపోనుంది. ఈ కీలక పరిమాణానికి ఏకగ్రీవ ఆమోదం దక్కింది. టాటా గ్రూప్ లోని కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్. ఇది రెండుగా విడిపోనుంది. దీనికి కంపెనీ బోర్డు ఆమోదం లభించింది. కంపెనీ షేర్ హోల్డర్లు సైతం ఏకగ్రీవ ఆమోదం తెలిపారు. ఈ ప్రకారం రెండు వేర్వేరు నమోదిత కంపెనీగా మారనుంది.
తాజాగా వెల్లడైన సమాచారంతో.. టాటా మోటార్స్ స్టాక్ దూసుకెళ్లింది.
ఉదయం సెషన్లోనే 4 శాతం పెరిగి నిఫ్టీ-50 సూచీలో టాప్ గెయినర్ గా నిలిచింది. కంపెనీని రెండుగా విభజించేందుకు షేర్ హోల్డర్లు ఏకగ్రీవ ఆమోదం తెలపడంతో మదుపరుల స్టాక్స్ కొనేందుకు మొగ్గు చూపారు.
తాజాగా విభజనకు మూల కారణం.. టాటా మోటార్స్ నుంచి వాణిజ్య వాహనాల వ్యాపారాన్ని ప్రత్యేక కంపెనీగా మార్చాలనుకోవడమే. దీనికి 99.99 శాతం మంది వాటాదారులు సమ్మతి తెలిపారు. అంటే షేర్ హోల్డర్లు అందరూ సముఖంగా ఉన్నట్లే.
వాస్తవానికి టాటా మోటార్స్ ను రెండుగా విభజించే ప్రణాళిక నిరుడు మార్చిలోనే వెల్లడైంది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ నుంచి ఆమోదం కూడా వచ్చింది. తర్వాత షేర్ హోల్డర్ల ఆమోదానికి వెళ్లింది. తాజాగా ఈ ప్రక్రియ కూడా పూర్తయింది.
విభజన ఇలా..
టాటా మోటార్స్ విభజన ప్రకారం.. ఒక షేర్ ఉంటే రెండు కంపెనీల్లో షేర్లు దక్కుతాయి. ఇక విభజిత కంపెనీల్లో ఒకటి పూర్తిగా వాణిజ్య వాహనాల వ్యాపారం చేపడితే.. మరోటి ప్రయాణికుల వాహనాల వ్యాపారాన్ని నిర్వహిస్తుంది.
బలం ఇచ్చిన ఒప్పందం..
రెండు కంపెనీల ప్రకటనతో పాటు టాటా మోటార్స్ షేర్లు స్టాక్ మార్కెట్ లో రాణించడానికి కారణం.. ఇటీవల భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడమే. దీనిప్రకారం ప్రీమియం కార్లపై దిగుమతి సుంకాలను 10 శాతానికి తగ్గించనున్నారు. బ్రిటన్ లో తయారై భారత్ లోకి వచ్చే జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి ఖరీదైన కార్లకు ఇది మంచి పరిణామం.