7000 కోట్ల కంపెనీ దివాలా.. అదే రోజు బిలియనీర్ అవ్వాలని ప్లాన్!
తాజాగా రణబీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్ లో అతడు చెప్పిన కొన్ని విషయాలు విస్మయపరిచాయి.
By: Tupaki Desk | 6 May 2025 4:05 AMప్రపంచవ్యాప్తంగా బిలియనీర్లు ఎందరో ఉన్నారు. ఒక్కోసారి బ్యాడ్ టైమ్ కారణంగా కంపెనీలు దివాలా తీసి చివరికి రోడ్డున పడిన వారు ఎందరో. అలాంటి స్థితికి వచ్చాక కూడా తాను మళ్లీ బిలియనీర్ గా ఎదిగేందుకు ప్రణాళిక రచించానని అన్నారు `ఎయిర్సెల్` వ్యవస్థాపకుడు చిన్న కన్నన్ శివశంకరన్. తాజాగా రణబీర్ అల్లాబాడియా పాడ్ కాస్ట్ లో అతడు చెప్పిన కొన్ని విషయాలు విస్మయపరిచాయి.
2018లో దివాలా కోసం దాఖలు చేసిన టెలికాం దిగ్గజం ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు శివశంకరన్ అలియాస్ శివ రూ.7,000 కోట్లు కోల్పోయి తిరిగి పుంజుకున్న తన ప్రయాణం గురించి పాడ్ కాస్ట్ లో మాట్లాడాడు. 68ఏళ్ల ఈ వ్యవస్థాపకుడు తనకు ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో సొంత ఇల్లు ఉన్నాయని తెలిపాడు. దేశ దేశాల్లో తనకు నివాసాలుండాలని కలలు కన్నట్టు చెప్పాడు. అంతేకాదు రెండు దీవులను కూడా కొని దివాలా కారణంగా తిరిగి అమ్మేసిన విషయాన్ని ఓపెనయ్యాడు. శివశంకరన్ తాను దివాలా కోసం దాఖలు చేసే ముందు డోనాల్డ్ ట్రంప్ పుస్తకాన్ని చదివానని, అది తిరిగి ప్లాన్ లను పునరుద్ధరించడానికి ప్రేరేపించిందని చెప్పాడు. నేను దివాలా కోసం దాఖలు చేసిన అదే రోజు, మళ్ళీ బిలియనీర్ కావడానికి ఏం చేయాలో ఒక ప్రణాళికను రూపొందించాను అని వెల్లడించారు. ఎయిర్ సెల్ అధినేత నికర ఆస్తుల విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు. కానీ దివాలా కారణంగా అతడికి చిక్కులు వచ్చి పడ్డాయి.
దివాలా దాఖలు చేయడానికి ముందు తన అత్యంత ఖరీదైన కొనుగోళ్ల గురించి శివశంకరన్ ఓపెనయ్యాడు. తాను రియల్ ఎస్టేట్లో భారీగా పెట్టుబడి పెట్టానని.. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సొంతంగా ఇళ్ళు కొనుగోలు చేసానని, స్వేచ్ఛగా జీవించడానికి రెండు ప్రైవేట్ దీవులను కొనుగోలు చేశానని చెప్పాడు. సీషెల్స్లో రెండు దీవులను కొన్నానని వెల్లడించాడు. వాటిని అతడు ఇప్పుడు అమ్మేసాడు. స్వదేశంలో నివసిస్తున్నట్లు అనిపించాలని కోరుకుని తాను ఆ దీవులను కొనుగోలు చేశానని చెప్పాడు. నేను సీషెల్స్, అమెరికా, కెనడా, లండన్లలో ఇళ్ళు కొన్నాను. నాకు అన్ని ఖండాలలో నివాసం ఉండాలని కోరుకున్నాను.. దానికోసమే దీవులు కొన్నాను అని చెప్పారు. కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్లో 14 ఎకరాల ఇల్లు ఉంది. ఇక్కడ హెలిప్యాడ్ కూడా ఉందని, కెనడాలో అవార్డులు గెలుచుకున్న ఒక భవనం కూడా తనకు ఉందని ఆయన తెలిపారు.
చెన్నైలోను ఒక ఇల్లు ఉంది. దాని కోసం రూ.524 కోట్లు చెల్లించానని, 71 గదులతో ఉన్న ఆ ఇల్లు ఇప్పుడు కూల్చివేసారని శివశంకరన్ తెలిపాడు. 71 బెడ్ రూములు ఉన్న ఈ ఇంట్లో ఒకప్పుడు తాను నివశించానని తెలిపాడు. కానీ వారు ఆ ఇంటిని పడగొట్టారు. ఆ తర్వాత కూడా నేను ఆ ఇంట్లో సగం తిరిగి కొన్నాను అని చెప్పాడు. ఇప్పుడు నా దగ్గర 2 ఎకరాల ప్లాట్ ఉంది.. కానీ నేను ఇల్లు కట్టాలనుకోవడం లేదు.. ముందుగా నేను అన్ని సమస్యలను పరిష్కరించాలనుకుంటున్నాను.. అని తెలిపాడు.