వెంకయ్య నోట.. అదే ఆవేదన

Update: 2019-05-19 08:59 GMT
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాధపడ్డారు. పరోక్షంగా తన బాధనంతా వెల్లగక్కారు. తనను రాజకీయాలకు దూరం చేశారని వాపోయారు. ప్రజాసేవకు తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడే దూరంగా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో లేకపోవడం.. ఈపారి పోటీచేయకపోవడంపై తన బాధనంతా వెళ్లగక్కారు.

ఎగ్జిట్ పోల్స్ పై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం వచ్చే ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురుచూడకుండా.. ఎగ్జాట్ పోల్స్ (తుది ఫలితాలు) కోసం ఎదురుచూడాలని ప్రజలు, నాయకులకు సూచించారు. గుంటూరులో పర్యటనకు వచ్చిన వెంకయ్య ఈ సందర్భంగా రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు.

తన 42 ఏళ్ల రాజకీయ జీవితంలో తాను లేకుండా జరుగుతున్న ఈసారి ఎన్నికలు జరిగాయని వెంకయ్య ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.  ప్రజలు ఇచ్చిన విరాళాలతోనే తాను ఎన్నికల్లో పోటీచేశానని.. నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ వాళ్లు చెప్పేది వినకపోతే తనకు మనశ్శాంతి ఉండదని వెంకయ్య చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రజలకు దూరమయ్యానని.. అయినా గౌరవప్రదమైన పదవిలో కొనసాగుతున్నానని అన్నారు.

ఎన్నికల సమయంలో తాను 16 సభలలో పాల్గొనే వాడినని.. ఉపరాష్ట్రపతిగా తనవంతు ప్రజాసేవకు కృషి చేస్తున్నానని వెంకయ్య తెలిపారు. నేడు నడుస్తున్న చట్టసభలు నడుస్తున్న తీరు బాధకరమని రాజకీయ నేతల భాష అసభ్యకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఎవరికి ఎవరూ శత్రువులు కారని.. వ్యక్తిగత దూషణలు, పరుష పదజాలం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

వెంకయ్య మాటలు విన్నాక మనకూ ఒకటే అర్థమవుతోంది. తనకు ఇష్టం లేని ఉత్సవ విగ్రహం లాంటి ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టి తనను ప్రజలకు దూరం చేశారనే బాధ ఆయనలో కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీ అధిష్టానం వెంకయ్యను రాజకీయాల నుంచి తప్పించి ఉపరాష్ట్రపతిని చేసినప్పుడే ఈ విమర్శలు వచ్చాయి. మోడీషాలు బలమైన వెంకయ్యను సైడ్ చేశారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడు వెంకయ్య నోట కూడా అవేమాటలు రావడం చర్చనీయాంశమయ్యాయి.


Tags:    

Similar News