బాబు కటౌట్ ఎక్కి టీడీపీ వార్డు మెంబర్ రచ్చ

Update: 2015-11-30 09:54 GMT
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద తాజాగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పార్టీకి చెందిన ఒక చోటా నేత కారణంగా ఏర్పడిన అలజడి సంచలనంగా మారింది. ఏపీ సీఎంవో వద్ద ఏర్పాటు చేసిన చంద్రబాబు భారీ కటౌట్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హడావుడి చేశారు. దీంతో.. అధికారులు ఉక్కిరిబిక్కిరి కావటమే కాదు.. తీవ్ర ఒత్తిడికి గురయ్యారు.  తన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు వంద అడుగుల కటౌట్ ఎక్కి.. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించటం.. చేతిలో సూసైడ్ నోట్ పట్టుకోవటంలో పోలీసులు హడలిపోయారు. కటౌట్ ఎక్కిన ఆ తెలుగు తమ్ముడు ఎవరు? సొంత పార్టీ అధికారంలో ఉన్నా అతనెందుకు అలా చేశాడన్న వివరాల్లోకి వెళితే..

బెజవాడలోని ఏపీ సీఎంవో వద్ద బాబు కటౌట్ ఎక్కిన వ్యక్తి కర్నూలు జిల్లా అస్పరి మండలం అద్దెకల్లు నివాసి అయిన గోవిందరాజులు. వ్యవసాయం చేసే గోవిందరాజులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరాభిమాని. గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి వార్డు మెంబరుగా కూడా విజయం సాధించాడు. అయితే.. వర్షాభావంతో పంటనష్టంతో పాటు.. అనారోగ్యంతో వైద్యం కోసం ఖర్చులు చేయటంతో అప్పుల పాలయ్యాడు.

క్యాన్సర్ తో బాధపడుతున్న అతడు  తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. దీంతో.. ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్లుగా సూసైడ్ నోట్ లో గోవిందరాజులు పేర్కొన్నాడు. ఏపీ పోలీసులు సమయోచితంగా వ్యవహరించి.. గోవిందరాజుల్ని కటౌట్ మీద నుంచి కిందకు దించారు. అనంతరం అతన్ని తమతో తీసుకెళ్లారు. అతను మీడియాతో మాట్లాడితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే వీలుంది.
Tags:    

Similar News