బీజేపీ-టీడీపీ ఫైట్..పరకాలకు ఎసరు పెట్టింది?

Update: 2018-05-21 09:20 GMT
ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లుగా బీజేపీ - టీడీపీ మధ్య విభేదాలు కాస్తా ఇంతకాలం చంద్రబాబు టీంలో చల్లగా పనిచేసుకుంటున్న ఓ వ్యక్తి సీటుకు ఎసరు తెచ్చాయంట. అవును.. బీజేపీ - టీడీపీల బంధం తెగిపోయాక సీఎం చంద్రబాబు మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌ ను అప్రకటితంగా పక్కనపెట్టేశారట. అందుకు కారణమేంటో తెలిసే ఉంటుంది. ఇంకేముంది.. ఆయన మోదీ కేబినెట్లో మహిళా మంత్రిగారికి భర్త కావడమే అందుకు కారణం.
    
బీజేపీ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ భ‌ర్త ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ చంద్రబాబు మీడియా స‌ల‌హాదారుగా ఉన్న సంగతి తెలిసిందే. కేవలం సలహాదారుగా ఉండడమే కాకుండా బాబు రాజకీయ బృందంలో ఎంత కీలకంగా ఉండేవారో కూడా తెలిసిందే. అయితే.. ఆయన్ను కొద్దికాలంగా చంద్రబాబు పక్కనపెట్టారట. మొన్నీమధ్య జరిగిన క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో చంద్ర‌బాబు గ్రూప్ కంపెనీలకు చెందిన సంజ‌య్ ఆరోరాను క‌మ్యూనికేష‌న్ల స‌ల‌హాదారుగా ప్ర‌క‌టించారట కూడా. అప్పటికి అక్కడే ఉన్న పరకాల ఈ నిర్ణయం వినగానే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అప్పటి నుంచి మళ్లీ అమరావతి ఛాయల్లో పరకాల కనిపించలేదని టాక్.
    
పరకాల సతీమణి నిర్మలా సీతారామణ్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. రెండు పార్టీల మధ్య సంబంధాలు బాగున్న కాలంలో పరకాల ద్వారా కేంద్రంలో ఏమైనా పావుల కదపొచ్చన్న ఉద్దేశంతో పరకాలకు ప్రాధాన్యమిచ్చారన్న వాదనా ఒకటుంది. అయితే.. ఇప్పుడు బీజేపీతో పొరపొచ్చాలు నేపథ్యంలో పరకాల వల్ల తమ రహస్యాలు బీజేపీకి చేరే ప్రమాదముందని ఆయనకు పొగపెట్టారని టాక్. 2014లో చంద్రబాబు సీఎం అయింది మొదలు.. ఆయన చేసిన ప్రతి విదేశీ పర్యనలలో పరకాల దాదాపుగా ఉన్నారు.  అక్కడ ఏం జరిగిందో అంతా ఆయనకు తెలుసు.. ఇంకా చంద్రబాబు, లోకేశ్ లకు సంబంధించిన ఎన్నో వ్యవహారాలు పరకాలకు తెలుసంటారు. దీంతో ఆయన వల్ల బీజేపీకి తన జుత్తు అందుతుందేమో అన్న భయంతోనే చంద్రబాబు ఆయన్ను పక్కనపెట్టేశారని వినిపిస్తోంది.
Tags:    

Similar News